భార్య దారుణ హత్య: భారత సంతతికి వ్యక్తికి యావజ్జీవ కారాగార శిక్ష విధించిన యూకే కోర్టు
లండన్: కట్టుకున్న భార్యను దారుణంగా హత్య చేసిన 23 ఏళ్ల భారత సంతతికి చెందిన వ్యక్తికి యూకే కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. కోర్తు తీర్పుతో బ్రిటన్లో ఉంటున్న గుజరాత్ రాష్ట్రానికి చెందిన జిగు కుమార్ సోర్ది.. 28 సంవత్సరాలు జైలులో గడపనున్నారు. ఆ తర్వాత మాత్రమే పెరోల్ ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామని లైసెస్టర్ షైర్ క్రౌన్ కోర్టు స్పష్టం చేయడం గమనార్హం.
లైసెష్టర్ పట్టణంలోని తన ఇంటిలోనే జిగు కుమార్ తన భార్య భావినీ ప్రవీణ్(21)ను అత్యంత దారుణంగా కత్తితో పొడిచి చంపేశాడు. ఈ హత్య కేసు విచారణ సందర్భంగా కోర్టు న్యాయమూర్తి తీవ్రంగా స్పందించారు.
ఇక హత్య కేసుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. 2017లో జిగుకుమార్, భావినీల వివాహం జరిగింది. 2018లో భావినీని తనతోపాటు బ్రిటన్ తీసుకెళ్లాడు. అయితే, కొద్ది కాలానికి వీరిద్దరి మధ్య విభేదాలు చోటు చేసుకున్నాయి. దీంతో వీరిద్దరి వేర్వేరుగా ఉంటున్నట్లు సమాచారం. ఈ క్రమంలో మార్చి 2న మధ్యాహ్నం 12.30గంటలకు జిగుకు కుమార్ భావిని ఇంటికి వెళ్లాడు.
కొద్ది నిమిషాలపాటు ఆమెతో మాట్లాడిన జిగుకుమార్.. ఆ తర్వాత ఆమెపై కత్తితో దాడి చేశాడు. విచక్షణారహితంగా ఆమెను పొడిచి అక్కడ్నుంచి పరారయ్యాడు. రక్తపు మడుగులో ఉన్న ఆమెను ఆస్పత్రికి తరలించే లోపే మరణించారు. ఘటనపై దర్యాప్తు జరిపిన పోలీసులు.. జిగుకుమార్ను అరెస్ట్ చేశారు.
కాగా, భావిని తనను నిర్లక్ష్యం చేసిందని, వివాహాన్ని రద్దు చేకోవాలనే నిర్ణయం తనను బాధించిందని జిగుకుమార్ విచారణలో తెలిపాడు. తన జీవితాన్ని నాశనం చేసిందనే కోపంతోనే తాను ఆవేశంలో ఈ దారుణానికి పాల్పడినట్లు చెప్పాడు. వాదనలు విన్న కోర్టు అతనికి యావజ్జీవ కారాగార శిక్షను విధించింది.