మిలియన్ డాలర్ల కోసం ఇండియన్ విద్యార్థి రీసెర్చ్ దొంగిలించిన ప్రొఫెసర్, ఏం జరిగిందంటే?
మిసోరీ: విద్యార్థి రీసెర్చ్ను దొంగిలించి, దానిని సొమ్ము చేసుకోవాలనుకున్న ప్రొఫెసర్ పైన లాసూట్ ఫైల్ చేశారు. సదరు ప్రొఫెసర్, అలాగే, బాధిత విద్యార్థి.. ఇద్దరూ భారతీయులే. ఈ సంఘటన మిసోరీలో చోటు చేసుకుంది. మాజీ గ్రాడ్యుయేట్ విద్యార్థి కిషోర్ చోల్కార్ రీసెర్చ్ను సొమ్ము చేసుకున్నాడని, అందుకుగాను ప్రొఫెసర్ పైన లాసూట్ ఫైల్ చేశారని వార్తలు వచ్చాయి.
భారతీయ ప్రొఫెసర్పై లాసూట్
కన్సాస్ సిటీలోని యూనివర్సిటీ ఆఫ్ మిసోరీ.. ఫార్మసీ ప్రొఫెసర్ పైన దావా వేసింది. సదరు ప్రొఫెసర్ ఓ విద్యార్థికి సంబంధించిన రీసెర్చ్ను దొంగిలించి, దానిని అమ్మివేశాడని పేర్కొంది. ఈ రీసెర్చ్ ద్వారా పెద్ద మొత్తంలో వస్తుందని అతను భావించినట్లుగా పేర్కొన్నారు. సదరు ప్రొఫెసర్ పేరు ఆశిమ్. అతనిపై యూనివర్సిటీ.. ఫెడరల్ లాసూట్ ఫైల్ చేసింది.
మిలియన్ డాలర్లతో పాటు రాయాల్టీస్
మాజీ గ్రాడ్యుయేట్ విద్యార్థి కిషోర్ చోల్కార్కు చెందిన రీసెర్చ్ అమ్మడం ద్వారా ఆ ప్రొఫెసర్ 1.5 మిలియన్ డాలర్లు సంపాదించినట్లుగా పేర్కొన్నారు. అంతేకాదు, ఈ రీసెర్చ్ ద్వారా అతను మరో అయిదేళ్ల పాటు 10 మిలియన్ డాలర్ల కంటే ఎక్కువగా రాయాల్టీస్ పొందుతారని ఆ లాసూట్లో పేర్కొన్నారు. మాజీ గ్రాడ్యుయేట్ విద్యార్థి కిషోర్ చోల్కార్ రీసెర్చ్ను అమ్మడం ద్వారా ఈ ప్రొఫెసర్.. యూనివర్సిటీని మోసం చేశారని చెప్పారు. దీనిని అమ్మడం ద్వారా అతను సంపాదించినదంతా యూనివర్సిటీకే చెందుతుందని ఆ లాసూట్లో పేర్కొన్నారు. కిషోర్ చోల్కార్ ఇక్కడే గ్రాడ్యుయేట్ రీసెర్చ్ అసిస్టెంట్గా దానిని డెవలప్ చేశారని, కాబట్టి అది యూనివర్సిటీకి చెందుతుందన్నారు. ఈ లాసూట్లో సదరు ప్రొఫెసర్తో పాటు ఆయన సతీమణిని కూడా చేర్చారు.
ఆరోపణలు కొట్టిపారేసిన ప్రొఫెసర్
మరోవైపు, సదరు ప్రొఫెసర్ మాత్రం ఈ ఆరోపణలను కొట్టి పారేస్తున్నారు. అతను గత నెలలోనే రిజైన్ చేశారు. తమపై అంతా తప్పుడు ప్రచారం సాగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. నేను, నా భార్య ఏ తప్పు చేయలేదన్నారు. మరోవైపు, ఈ లాసూట్ పైన మాజీ గ్రాడ్యుయేట్ కిషోర్ చోల్కార్ స్పందించలేదు. ఆ లాసూట్ ప్రకారం... ఆ ప్రొఫెసర్ ఈ రీసెర్చ్ను అమెరికాలోని వర్జిన్ ఐస్లాండ్లోని ఓ సంస్థకు అమ్మినట్లుగా ఉంది. అదే సంస్థ దీనిని 40 మిలియన్ డాలర్లకు తిరిగి భారత్కు చెందిన ఫార్మాస్యూటికల్ కంపెనీకి అమ్మింది. ఈ భారతీయ ఫార్మాస్యూటికల్ సంస్థకు దీనిని మార్కెట్ చేసుకునేందుకు ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుంచి గత ఏడాది ఆగస్ట్ నెలలో అప్రూవ్ వచ్చింది. లాభాల్లో యూనివర్సిటీకి షేర్ రావాల్సి ఉందని, అది రాకుండా చేశారని యూనివర్సిటీ ఆరోపించింది. ఇదిలా ఉండగా, గత ఏడాది కిషోర్ చోల్కార్ మాట్లాడుతూ.. అది తన ఉత్పత్తి అని, రాత్రి పగలు కష్టపడి దానిని తయారు చేశానని, కానీ తన పేరును చేర్చలేదని చెప్పినట్లుగా తెలుస్తోంది. ఈ ఉత్పత్తి కోసం తాను ఒక్కడిని పని చేశానని, దీని కోసం తన శక్తినంతా దారపోశానని, కానీ తనను చీట్ చేశారని చెప్పాడట.
గతంలోను ఆరోపణలు
సదరు ప్రొఫెసర్ పైన గత ఏడాది కూడా కొన్ని ఆరోపణలు వచ్చాయి. భారత్కు చెందిన ఓ విద్యార్థులతో బలవంతంగా వ్యక్తిగత పనులు చేయించుకున్నట్లుగా ఆరోపణలు ఉన్నాయి. బేస్మెంట్ క్లీనింగ్, తమ కుక్కను వాకింగ్కు తీసుకెళ్లడం, చెట్లకు నీరు పోయడం వంటి పనులు చెప్పాడని తెలుస్తోంది. అతను చెప్పిన పని చేయకుండా యూనివర్సిటీ నుంచి పంపింస్తారని, వీసాలు కోల్పోతామనే భయంతో వారు ఆ పనులు చేశారట.