సీక్రెట్గా: ప్రియుడి కోసం భర్తని చంపిన ఎన్నారై మహిళను ఎలా పట్టేశారంటే, డైరీలో విస్తుపోయే రాతలు
మెల్బోర్న్: ఆరెంజ్ జ్యూస్లో సైనెడ్ కలిపి భర్తను హత్య చేసిన కేరళకు చెందిన మహిళ, ఆమె మాజీ ప్రియుడికి ఆస్ట్రేలియా న్యాయస్థానం ఇరవై ఏళ్లకు పైగా శిక్ష విధించిన విషయం తెలిసిందే. 34 ఏళ్ల సోఫియా సామ్(34) ప్రియుడు అరుణ్ కమల్ హాసన్తో (36) కలిసి 2015 అక్టోబర్ 14న భర్త సామ్ అబ్రహంను హత్య చేసింది. మర్డర్ ప్లాన్ రూపొందించిన అరుణ్కు 27 ఏళ్ల జైలు శిక్ష, సోఫియాకు 22 ఏళ్ల శిక్ష విధించింది ఆస్ట్రేలియా సుప్రీం కోర్టు.
ప్రియుడి కోసం భర్తను చంపి, ఎన్నారై మహిళ నాటకం: 20ఏళ్ల జైలుశిక్ష విధించిన ఆస్ట్రేలియా కోర్టు
అబ్రహం హత్య తర్వాత స్నేహితులు, కుటుంబ సభ్యులకు సోఫియా, అరుణ్ కుమార్లపై అనుమానం వచ్చింది. దీంతో అతని హత్య తర్వాత చాలా నెలల పాటు డిటెక్టివ్లు సోఫియా, అరుణ్ కదలికలపై నిఘా పెట్టారు. వారు ఎక్కడెక్కడ కలుసుకుంటున్నారు, ఏం చేస్తున్నారో గమనించారు. ఈ క్రమంలో అరుణ్కు సోఫియా రహస్య డైరీ ఇచ్చిన విషయాన్ని గుర్తించారు. డైరీ ద్వారా ఒకరిపై మరొకరికి ఉన్న ప్రేమ తెలిసింది.
అబ్రహం-సోఫియాలు ఇలా పరస్పరం తెలుసు
సామ్ అబ్రహం సింగర్. అతను కొల్లాం జిల్లాలోని పునలూర్ సమీపంలోని కరవలూరు గ్రామంలోని బెథెల్ మార్థోమా చర్చిలో పాటలు పాడేవాడు. సోఫియా కూడా గాయని. వీరిద్దరి కుటుంబాలు పరస్పరం పరిచయం ఉందని తెలుస్తోంది. తండ్రి అబ్రహంను చంపేశారు. తండ్రిని చంపేసినందుకు తల్లికి జైలు శిక్ష పడింది. ప్రస్తుతం వారి కొడుకు ఆస్ట్రేలియాలోని సోఫియా సోదరి ఇంట్లో ఉంటున్నట్లుగా తెలుస్తోంది. అతనిని తమకు అప్పగించాలని అబ్రహం తల్లిదండ్రులు అంటున్నారు.
పెళ్లి చేసుకుంటామంటే ఆశ్చర్యపోలేదు
సోఫియా ఈ దారుణానికి పాల్పడిందంటే అబ్రహం తల్లిదండ్రులు నమ్మలేకపోయారట. తమకు కూతురులా మెదిలిన ఆమె చంపిందంటే ఆశ్చర్యపోతున్నారని తెలుస్తోంది. కొన్నేళ్ల క్రితం తన కొడుకు అబ్రహం, సోఫియా పెళ్లి చేసుకుంటామని తమతో చెబితే మేం ఆశ్చర్యపోలేదన్నారు. తొలుత అబ్రహం చెప్పాడని, ఆ తర్వాత సోఫియా చెప్పిందని తెలిపారు. మాకు సోఫియా చిన్నప్పటి నుంచి తెలుసునని, కాబట్టి వారి పెళ్లికి అడ్డు చెప్పలేదన్నారు.
కూతురులా మాట్లాడేది
తమకు ఇద్దరు కొడుకులు ఉన్నారని, కూతుళ్లు లేరని, ఆమె కూతురులా ఉండేదని, తమను మమ్మీ, పప్పా అని పిలిచేదని వాపోయారు. ఇష్టం లేనట్లుగా ఎప్పుడూ ప్రవర్తించలేదన్నారు. సోఫియా చేసిందని తొలుత అతని తల్లిదండ్రులు కూడా నమ్మలేదు. ఆ రోజు డెడ్ బాడీతో పాటు సోఫియా, ఆమె సోదరి, తల్లిదండ్రులు, సోఫియా తనయుడు వచ్చారు. సోఫియా బాగా ఏడ్చింది.
ఆ తర్వాత షాకయ్యాం
చనిపోయిన మొదటి పదినెలలో సోఫియా తమతో నిత్యం ఫోన్లో మాట్లాడిందని, కానీ ఆ తర్వాత పోలీసులు అరెస్టు చేయడానికి ముందు రోజు మాత్రమే మాట్లాడిందని అబ్రహం తల్లిదండ్రులు చెప్పారు. ఆమె మాటల్లో, ఎక్కడా తేడా కనిపించలేదన్నారు. చిన్నపాటి అనుమానం కూడా రాలేదన్నారు. కానీ ఆ తర్వాత మాత్రం ఆమె చేసిన పనికి షాకయ్యామన్నారు. కోర్టు తీర్పు పట్ల తాను సంతోషంగా ఉన్నామని చెప్పారు. సోఫియా కుటుంబ సభ్యులు తమకు దగ్గరలోనే ఉంటారని, కానీ ఆమె అరెస్టు తర్వాత తమతో వారు ఒక్కసారి కూడా మాట్లాడలేదన్నారు.
మనవడి కోసం కోర్టుకైనా వెళ్తాం
సామ్ అబ్రహం తల్లిదండ్రులు ఇంకా మాట్లాడుతూ.. తమ మనవడు తమకు కావాలని చెప్పారు. ఇందుకోసం తాము కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సహకారం తీసుకుంటామని చెప్పారు. అవసరమైతే తాము తమ ఆస్తులను అన్నింటిని అమ్మేసి మనవడి కోసం ఆస్ట్రేలియా కోర్టుకు వెళ్తామని చెప్పారు. మాకు ఇప్పుడు మా మనవడు కావాలని చెప్పారు.
ఏం చెప్పకుండా.. విచారణ
సామ్ అబ్రహంకు సైనెడ్ కలిపిన జ్యూస్ ఇచ్చారని తేలిన తర్వాత పోలీసులు విచారణ ప్రారంభించారు. హత్య జరిగిన రోజు.. సోఫియా తాను తయారు చేసిన ఆవోకాడో మిల్క్ భర్తకు ఇచ్చింది. ఆ తర్వాత సైనేడ్ కలిపిన ఆరెంజ్ జ్యూస్ కారణంగా మృతి చెందాడని పోలీసులు గుర్తించారు. అయితే ఈ విషయాలను ఏవీ చెప్పకుండానే విచారణ అధికారులు ఆమెను అనుసరించారు. ఇవేమీ తెలియకుండా సోఫియా, అరుణ్లు కలుసుకున్నారు. ఎప్పుడైతే సోఫియా తన భర్త సామ్ అబ్రహం కారును అరుణ్ పేరు మీదకు మార్చిందో, ఎప్పుడైతే అరుణ్తో కలిపి జాయింట్ అకౌంట్ ప్రారంభించిందో.. అప్పుడు పట్టేసుకున్నారు.
డైరీలో విస్తుపోయే రాతలు
14 అక్టోబర్ 2014న ఆస్ట్రేలియా.. మెల్బోర్న్లోని ఎప్పింగ్లోని అపార్టుమెంటులో అబ్రహం హత్యకు గురయ్యాడు. కాగా, వారి డైరీ సోఫియా, అరుణ్ల మధ్య లోతైన ప్రేమను వెల్లడిస్తోంది. బుధవారం జడ్జి డైరీలోని కొన్ని అంశాలను చదివారు. 'ఇతరుల కంటే మనం ఎవరో ఒకరిని ఎందుకు అతిగా ఇష్టపడతామో తెలియదు', 'నీకు హగ్ ఇవ్వడం ఇష్టం'.. అంతేకాదు, నీ చేతుల్లో నిద్రపోవాలని ఉందని కూడా రాసింది. 18 జూలై 2015న డైరీలో మరో వాక్యం రాసింది. మనం చేయాల్సిన పనికి ప్లానింగ్ అవసరమని, ప్లాన్ లేకుండా ఒక ఆలోచన చేస్తే అది కలనే అనే అర్థం వచ్చేలా రాసింది.
తల్లిదండ్రులు లేకుండా పెరగాల్సిన స్థితి
మీరు సాం అబ్రహం స్నేహితులు, దగ్గరివారయి ఉండి హత్య చేశారని, ఇది తీవ్రమైన ఉదాహరణ అని జడ్జి వ్యాఖ్యానించారు. విచారణలో మీ ఇద్దరికి చాలాకాలంగా రిలేషన్షిప్ ఉందని తేలిందన్నారు. జడ్జి ఇంకా మాట్లాడుతూ.. ప్రస్తుతం ఈ కేసులో అతిపెద్ద బాధితుడు సోఫియా-సాం అబ్రహం తొమ్మిదేళ్ల కొడుకు అని చెప్పారు. అతను ఇక తన తల్లిదండ్రులు లేకుండా పెరగాలని ఆవేదన వ్యక్తం చేశారు.
కాగా, ప్రియుడు అరుణ్తో కలిసి భర్త అబ్రహంను చంపిన భార్య సోఫియాకు, ప్రియుడికి ఆస్ట్రేలియా కోర్టు గురివారం శిక్ష విధించిన విషయం తెలిసిందే. సోఫియా అబ్రహంను పెళ్లి చేసుకున్నది. కానీ మహాత్మా గాంధీ యూనివర్సిటీలో అరుణ్ కమలాసనన్తో కలిసి చదువుకున్నప్పుటే అతనితో పరిచయం.. ప్రేమకు దారి తీసింది. ఆ తర్వాత వారి వివాహేతర సంబంధం కొనసాగింది.