గాల్లోనే గాలిలో కలిసిపోయిన నిండు ప్రాణాలు: మృతుడు భారత సంతతి వ్యక్తి
అబుదాబి: న్యూఢిల్లీ నుంచి మిలాన్ వెళుతున్న విమానంలో భారత్కు చెందిన వ్యక్తి హఠాన్మరణం పొందడంతో పైలట్లు విమానంను అబుదాబి విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాడింగ్ చేశారు. ఈ ఘటన సోమవారం జరిగింది. మృతి చెందిన వ్యక్తిని 52 ఏళ్ల కైలాష్ చంద్ర సైనీగా గుర్తించారు. ఇటలీలో నివసిస్తున్న కైలాష్ చంద్ర రాజస్థాన్ రాష్ట్రానికి చెందినవాడని అధికారులు తెలిపారు.
ఇక మిలాన్కు కైలాష్ చంద్రతో పాటు అతని కొడుకు హీరాలాల్ సైనీ కూడా ప్రయాణిస్తున్నారు. ప్రస్తుతం అబుదాబిలోని భారత ఎంబసీ కైలాష్ మృతదేహాన్ని భారత్కు పంపేందుకు అన్ని విధాలా సహకరిస్తోంది. ఇందుకు కావాల్సిన మొత్తం డాక్యుమెంట్స్ను దగ్గరుండి అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే అన్ని లాంఛనాలు పూర్తయ్యాయని అధికారులు తెలిపారు. ఇక న్యూఢిల్లీలోని అధికారులతో చర్చలు జరుపుతున్నామని అబుదాబిలోని భారత ఎంబసీలో అధికారులు తెలిపారు.
అబుదాబి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో సోమవారం అర్థరాత్రి విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయ్యిందని భారత ఎంబసీ అధికారి రాజమురుగన్ చెప్పారు. ఎయిర్పోర్టుకు సమీపంలో ఉన్న మఫ్రఖ్ హాస్పిటల్కు మృతదేహాన్ని తరలించామని చెప్పారు.అబుదాబి అధికార యంత్రాంగం ఇప్పటికే డెత్ సర్టిఫికేట్ జారీ చేసిందని ఆఫీసర్లు తెలిపారు.ఇతిహాద్ విమానంలో తన తండ్రి మృతదేహం తీసుకుని భారత్కు హీరాలాల్ చేరుకుంటారని అధికారులు వివరించారు.