చైనాలో భారతీయ విద్యార్థి అనుమానాస్పద మృతి -టియాంజిన్ వర్సిటీ క్యాంపస్లో ఘటన
ఉన్నత చదువుల కోసం చైనా వెళ్లిన ఓ భారతీయ విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. టియాంజిన్ సిటీలోని టియాంజిన్ ఫారిన్ స్టడీస్ యూనివర్సిటీ(టీఎఫ్ఎస్యూ) క్యాంపస్ లోనే ఈ ఘటన చోటుచేసుకోవడం కలకలం రేపింది. కుటుంబీకులు, వర్సిటీ అధికారులు చెప్పిన వివరాలివి..
బిహార్లోని గయకు చెందిన అమన్ నాగ్సేన్ (20) అనే విద్యార్ధి చైనాలోని టియాంజిన్ యూనివర్సిటీలో ఇంటర్నేషనల్ బిజినెస్ స్టడీస్ చదువుతున్నాడు. వర్సిటీలోని తన గదిలో అతను శుక్రవారం విగతజీవిగా కనిపించాడు. అయితే నాగ్సేన్ విషాదాంతాన్ని వర్సిటీ అధికారులు దాచిపెట్టడానికి ప్రయత్నించారనే ఆరోపణలొచ్చాయి.
నాగ్సేన్ కుటుంబ సభ్యులు జులై 23న చివరిసారిగా అతడితో మాట్లాడారు. ఆపై నాగ్సేన్కు పలుమార్లు కుటుంబ సభ్యులు ఫోన్ కాల్స్, మెసేజ్లు చేసినా స్పందించలేదు. మొబైల్ యాప్ ద్వారా నగదు బదిలీ చేసినా బదులివ్వకపోవడంతో అనుమానంతో కుటుంబసభ్యులు నాగ్సేన్ స్ధానిక గార్డియన్కు సమాచారం ఇచ్చారు. ఆయన వర్సిటీ అధికారులను సంప్రదించగా విద్యార్ధి మరణించాడనే విషయం వెల్లడించారు
నాగ్సేన్ మృతదేహాన్ని భారత్కు రప్పించేందుకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సాయం చేయాలని మృతుడి మేనమామ పంకజ్ పాశ్వాన్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. నాగ్సేన్కు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని, ఆరోగ్యంగా ఉండేవాడని పాశ్వాన్ పేర్కొన్నారు. నాగ్సేన్ మృతదేహాన్ని సత్వరమే భారత్కు రప్పించాలని కోరుతూ గయలో విద్యార్ధులు ప్రదర్శన నిర్వహించారని ఆయన చెప్పారు.
చైనాలో భారతీయ విద్యార్ది మరణానికి గల కారణం, అందుకు దారితీసిన పరిస్ధితులు ఇంకా తెలియరాలేదు. నాగ్సేన్ విషాదాంతంపై సమాచారంలో జాప్యం జరగడంతో అతడు ఎప్పుడు మరణించాడు ఎందుకు తీవ్ర నిర్ణయం తీసుకున్నాడనే ప్రశ్నలు ముందుకొస్తున్నాయి. మరోవైపు నాగ్సేన్ మృతదేహాన్ని స్వదేశానికి తరలించేందుకు బీజింగ్లో భారత రాయబార కార్యాలయ అధికారులు కసరత్తు సాగిస్తున్నారు.