అమెరికాలో ఆ జంట సెల్ఫీ తీసుకుంటూనే మృతి! జీవితం విలువ ఒక్క ఫోటోనా అని పోస్ట్ చేసి...
న్యూయార్క్: భారత్కు చెందిన యువజంట విష్ణు విశ్వనాథ్ (29), మీనాక్షి మూర్తి(30) ఇటీవల కాలిఫోర్నియాలోని ప్రముఖ యోసెమైట్ జాతీయ పార్కులో సుమారు 800 అడుగుల ఎత్తైన పర్వతం నుంచి లోయలో పడి మృతి చెందిన విషయం తెలిసిందే. వారు సెల్ఫీ తీసుకోబోతూ ఈ లోయలో పడి మృతి చెందినట్లుగా తెలుస్తోంది.
అమెరికా: అన్యోన్యంగా ఉండే.. భారతీయ యువజంట అనుమానాస్పద మృతి, ఏం జరిగింది?
వారిద్దరు అత్యంత ఎత్తైన ఆ పర్వతం అంచున ప్రమాదకర ప్రదేశంలో సెల్ఫీ తీసుకుంటున్నారని విష్ణు విశ్వనాథ్ సోదరుడు జిష్ణు విశ్వనాథ్ చెప్పారు. ఈ మేరకు ఇంటర్నేషనల్ మీడియాలో వార్తలు వచ్చాయి. ప్రమాదానికి కొద్దిసేపటి ముందు కూడా వాళ్లు అక్కడ సెల్ఫీ తీసుకున్నారని జిష్ణు తెలిపినట్లు తెలుస్తోంది.
సెల్ఫీ కోసమే ట్రైపాడ్ సెట్ చేసి ఉంటారు
పర్వతం చివరలో ట్రైపాడ్కు కెమెరా అమర్చి ఉండటం, సమీపంలో మనుషులు లేకపోవడం గమనించిన పర్యాటకులు పార్కు రేంజర్లకు సమాచారం ఇచ్చారని, దీంతో విష్ణు విశ్వనాథ్, మీనాక్షి శర్మలు లోయలో పడిపోయినట్లుగా గుర్తించారని తెలిపారు. సెల్ఫీ తీసుకోవడానికే వారు ట్రైపాడ్ సెట్ చేసి ఉంటారని సోదరుడు చెప్పారు.
ఇతరులు తీసుకున్న ఫోటోల్లో కనిపించారు
కాగా, పార్క్ రేంజర్లు హెలికాప్టర్ సహాయంతో మృతదేహాలను బయటకు తీశారు. మరోవైపు, ప్రమాదం జరగడానికి ముందు అక్కడి పార్కులో ఫోటోలు తీసుకున్న ఇతర టూరిస్టుల కెమెరాలలోను వీళ్లు కనిపించారు. తాను, తన ప్రియురాలు కలిసి తీసుకున్న ఫోటోలు మీనాక్షిమూర్తి కనిపించారని సీన్ మాటెసన్ అనే టూరిస్ట్ తెలిపారు.
రెయిలింగ్లు లేవు
ఆ సమయంలో మీనాక్షి మూర్తి పర్వతం చివరకు చాలా దూరం వెళ్లారని, అప్పుడే తాము గాబరా పడ్డామని సదరు టూరిస్ట్ తెలిపారు. అయితే ఆమె అక్కడ కంఫోర్ట్గానే కూర్చుందని తెలిపారు. కాగా, ప్రఖ్యాతి గాంచిన ఈ పార్కులో విజిటర్స్ రక్షణ కోసం ఎలాంటి రెయిలింగ్లు లేవని చెబుతున్నారు. అంచు వరకు వెళ్లి లోయలో పడి మృతి చెందిన మీనాక్షి గతంలో ఇలా అంచున దిగే ఫోటోను తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసి, అలాంటి వాటిపై జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
మన జీవితం విలువ ఒక్క ఫోటో మాత్రమేనా?
కాగా, విష్ణు విశ్వనాథ్, మీనాక్షి మూర్తిలు సాహసయాత్రలు చేస్తారు. తమ సాహస యాత్రల వివరాలను హాలీడేస్ అండ్ హ్యాపీలీ ఎవర్ ఆప్టర్స్ పేరుతో బ్లాగ్లో ఎప్పటికి అప్పుడు పంచుకునేవారు. ఇందులో భాగంగా కొద్ది నెలల ముందు మీనాక్షి తన ఇన్స్టాగ్రాంలో సాహస యాత్రల సమయంలో ఎత్తైన ప్రదేశాలు, పర్వత శిఖరాలు వద్ద ఫోటోలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని పోస్ట్ చేశారు. అమెరికాలోని ప్రఖ్యాత గ్రాండ్ కెనాన్ వద్ద తీసుకున్న తన ఫోటోను పోస్ట్ చేస్తూ మీనాక్షి పైవిధంగా పేర్కొన్నారు. సాహసయాత్రలు చేసేవారు ధైర్యంగా పర్వతాల అంచున నిలబడి ఫోటోల కోసం ప్రయత్నిస్తారని, కానీ గాలి వేగం ఒక్కోసారి ప్రమాదాలకు కారణమవుతుందని తెలుసా, మన జీవితం విలువ ఒక్క ఫోటో మాత్రమేనా అని పేర్కొన్నారు.