పైరేటెడ్ సాఫ్ట్ వేర్: రూ. 66 లక్షలు జరిమానా
వాషింగ్టన్: పైరేటెడ్ సాఫ్ట్ వేర్ వాడినందుకు భారత్ కు చెందిన ఓ వస్త్ర తయారీ సంస్థ రూ. 66 లక్షల జరిమానా కట్టాల్సి వస్తోంది. మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లోని ప్రతిభా సింటెక్స్ లిమిటెడ్ అనే కంపెనీకి జరిమానా వేశారు.
ప్రతిభా సింటెక్స్ లిమిటెడ్ సంస్థ వాల్ మార్ట్ తో సహ పలు అగ్రశ్రేణి అమెరికన్ కంపెనీలకు దుస్తులు ఎగుమతి చేస్తున్నది. ఈ కంపెనీకి అమెరికా కంపెనీలు కాంట్రాక్టు ఇచ్చారు. అయితే ఈ ప్రతిభా సింటెక్స్ లిమిటెడ్ సంస్థ అక్రమ వ్యాపారం చేసిందని వెలుగు చూసింది.
అందు వలన కాలిఫోర్నియాలోని పలు కంపెనీలకు తీవ్రస్థాయిలో నష్టం వచ్చిందని, అమెరికా సాఫ్ట్ వేర్ కంపెనీలు కొత్త ఉత్పత్తులను తయారు చేసుకోలేక పోయిందని కాలిఫోర్నియా అటార్నీ జనరల్ కమలా హారీస్ తెలిపారు.
పైరేటెడ్ సాఫ్ట్ వేర్ వాడటమే ఆ కంపెనీ చేసిన పెద్ద నేరం అని వెలుగు చూసింది. అందు వలన కోర్టు ప్రతిభా సింటెక్స్ లిమిటెడ్ సంస్థకు ఒక లక్ష డాలర్లు (భారత్ కరెన్సీలో రూ. 66 లక్షలు) జరిమానా విధించింది.
నెల రోజుల్లో జరిమానా మొత్తం చెల్లించాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఎడోబ్, మైక్రో సాఫ్ట్ తదితర సంస్థల ఉత్పత్తులకు లైసెన్స్ ఫీజు చెల్లించకుండానే ఆయా కంపెనీల సాఫ్ట్ వేర్ లను ప్రతిభా సింటెక్స్ లిమిటెడ్ వాడుకుందని 2013లో కేసు నమోదు అయ్యింది.
ప్రపంచంలో ఎవరైనా సరే మేధోసంపత్తిని దొంగలించినా కాలిఫోర్నియా రాష్ట్రంలో వాళ్లను దోషులుగా నిర్ణయిస్తుందని కమలా హారిస్ చెప్పారు. ఏఐఎంఎస్ 360 అనే సాఫ్ట్ వేర్ ను కూడా ప్రతిభా సింటెక్స్ వాడుకుందని కమలా హారీస్ కేసు దాఖలు చేశారు.