ఆ ఒక్కడే లేకపోయి ఉంటే?..: శ్రీదేవి విషయంలో అన్నీ తానై.. సలాం కొట్టాల్సిందే!
Recommended Video
దుబాయ్: బతుకు ఎంత వైభవంగా సాగితేనేం.. చావులో కాస్త ప్రశాంతత కూడా లేకపోతే?.. చాలామంది సెలబ్రిటీల జీవితాలు ఆఖరి క్షణాల్లో ఆటుపోట్లకు గురైనవే. చావులోనూ ప్రశాంతత దొరకనివారు ఎంతోమంది.
బతికినన్నాళ్లు తన ముఖంలో ఎన్నడూ ప్రశాంతత చెరగని శ్రీదేవికి కూడా అలాంటి పరిస్థితులు ఎదురవడం విచారకరమే. కానీ అనేకానేక మలుపుల మధ్య చివరకు ఆమె అంతిమయాత్ర అంత ప్రశాంతంగా జరిగిందంటే.. దాని వెనకాల ఉన్న ఓ వ్యక్తి గురించి తప్పక గుర్తుచేసుకోవాలి.
శ్రీదేవి కోసం బోనీ కపూర్ చేసిందాని కన్నా, ఆమె ఆప్తులు చేసిన దానికన్నా ఆ వ్యక్తి చేసిన సహాయం అపూర్వం.
ఆఖరి పయనంలోనూ శ్రీదేవి రికార్డు?: అప్పట్లో రఫీ.. ఆ తర్వాత!
ఎవరా వ్యక్తి:
ఆయన పేరు అశ్రఫ్ షెర్రీ తమరసెరీ(44). చాలా ఏళ్ల క్రితం కేరళ నుంచి వచ్చి దుబాయ్లో స్థిరపడ్డాడు. వృత్తి రీత్యా మెకానిక్ అయినా.. ప్రవృత్తి మాత్రం దుబాయిలో మరణించినవారి మృత దేహాలను స్వస్థలాలకు పంపించడమే. ఇప్పటివరకు కొన్ని వేల శవాలను తమరసెరీ వారి వారి స్వస్థలాలకు పంపించి ఉంటాడు. మరణించినవాళ్లు ధనికులా? పేదలా? అన్నది తాను పట్టించుకోడు కానీ పేదలకు సహాయం చేసినప్పుడే తాను ఎక్కువ సంతృప్తి పొందుతానని మాత్రం చెబుతున్నాడు.
పేదల కోసం:
దుబాయ్ చట్టాలు అత్యంత కఠినంగా ఉంటాయి. అక్కడ ఫార్మాలిటీస్ పూర్తి చేయడం అంత ఆషా మాషీ కాదు. భారత్ నుంచి దుబాయ్ వెళ్లే వలసజీవులు అక్కడ ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోతే.. వారి మృతదేహాలను స్వస్థలానికి తీసుకురావడం వారి కుటుంబ సభ్యులకు తలకు మించిన భారం. అలాంటి వారెందరినో తమరసెరీ కష్టాల్లో ఆదుకున్నాడు.
ఆ సంఘటనతో 'శవ సంరక్షకుడి'గా..:
నిజానికి తమరసెరీ తన పనేదో తాను చేసుకుని సాఫీగా బతికేయొచ్చు. కానీ తను అలా భావించలేదు. ఒకానొక సంఘటన ఆయన జీవితం మొత్తాన్ని మలుపుతిప్పింది. 2000వ సంవత్సరంలో ఓసారి షార్జా ఆసుపత్రికి వెళ్లాడు తమరసెరీ. స్నేహితున్ని కలిసేందుకు వెళ్లిన సమయలో.. ఆసుపత్రి కారిడార్ లో ఇద్దరు పిల్లలు ధీనంగా ఏడుస్తూ కనిపిస్తారు.
ఆరా తీస్తే.. వాళ్ల తండ్రి చనిపోయాడని తెలిసింది. అయితే తండ్రి మృతదేహాన్ని తీసుకెళ్లడానికి ఎలాంటి ప్రొసీజర్ ఫాలో కావాలో వారికి తెలియదు. అప్పటికీ తమరసెరీకి కూడా దానిపై అవగాహన లేదు. కానీ పెద్ద మనసుతో చొరవ తీసుకుని లీగల్ ఫార్మాలిటీలన్ని పూర్తి చేయించి ఎట్టకేలకు మృతదేహాన్ని వారి స్వస్థలానికి పంపించాడు. ఇందుకోసం ఐదు రోజులు పట్టింది. అప్పటినుంచి తమరసెరీ.. ఓ 'శవ సంరక్షకుడు'గా మారిపోయాడు.
ఒక్క పైసా ఆశించని మహానుభావుడు..:
దాదాపు18 ఏళ్లుగా 38 దేశాలకు చెందిన 4,700 మృతదేహాలను వారివారి దేశాలకు పంపిచాడు తమరసెరీ. ఇందుకోసం ఆయన ఒక్క పైసా ఆశించలేదు. పైగా తన జేబు నుంచే ఖర్చు పెట్టుకున్న సందర్భాలెన్నో. ఇప్పటికీ ప్రతీరోజూ ఆయన సహాయం కోరుతూ పదుల సంఖ్యలో ఫోన్ కాల్స్ వస్తుంటాయి. అందుకే.. అత్యంత అవసరమైతేనే నాకు ఫోన్ చేయండి, ఎందుకంటే నా సహాయం ఇంకెవరికో అత్యవసరమై ఉంటుందని చెబుతాడతను.
శ్రీదేవి విషయంలోనూ.. అన్నీ తానై..:
శ్రీదేవి మృతదేహాన్ని దుబాయ్ నుంచి తరలించడం ఆలస్యమైన కొద్దీ ఆమె మరణంపై ఊహాగానాలు పెరుగుతూ వచ్చాయి. నిజానిజాల సంగతి పక్కనపెడితే.. అక్కడి ఫార్మాలిటీస్ ను పూర్తి చేసే విషయంలో ఈ జాప్యం మరింత ఎక్కువైంది.
ఈ నేపథ్యంలో తమరసెరీ అందించిన సహాయం మరువలేనిది. శవపంచనామా దగ్గరి నుంచి శ్రీదేవి డెడ్ బాడీని తిరిగి విమానంలో ఎక్కించే వరకు ప్రతీ అధికారి చుట్టూ, ఆఫీసు చుట్టూ తమరసెరీ ఎంత ప్రయాస పడ్డాడో. చట్టాలకు లోబడి, నిబంధనలను అనుసరిస్తూ అన్నీ ఫార్మాలిటీస్ ను పూర్తి చేయించి శ్రీదేవి మృతదేహాన్నిఎట్టకేలకు కుటుంబ సభ్యులకు అందేలా చేశాడు.
శ్రీదేవి ఎవరో కూడా తెలియదు..:
దేశమంతా శ్రీదేవిని అతిలోక సుందరి అని పొగుడుతున్నారు, సూపర్ స్టార్ అంటున్నారు కానీ తమరసెరీకి ఆమె గురించి పెద్దగా తెలియదు.
ఏ పరిచయం లేకుండానే.. ఏమి ఆశించకుండానే.. వేల మృతదేహాలను వారి వారి కుటుంబ సభ్యులకు అప్పగించడంలో, అక్కడినుంచి స్వస్థలాలకు పంపించడలో తమరసెరీ చేస్తున్న కృషి గురించి ఎంత చెప్పినా తక్కువే. శ్రీదేవి విషయంలోనూ ఎప్పటిలాగే తన పని తాను చేసుకుపోయాడు.
గుర్తించిన భారత ప్రభుత్వం..:
తమరసెరీ సేవలను గుర్తించి 2015లో భారత ప్రభుత్వం ఆయనకు ప్రవాసీ భారతీయ సమ్మాన్ అవార్డు బహుకరించింది. బుర్జ్ ఖలీఫాలో జరిగిన ఓ కార్యక్రమంలోనూ అక్కడి పోలీసులు ఆయన్ను సత్కరించారు. ఇండియాకు సంబంధించి తనొక్కటే చెబుతున్నాడు.
'పాకిస్తాన్ లాంటి దేశాలు తమవాళ్లు విదేశాల్లో మరణిస్తే ఉచితంగా స్వదేశానికి తరలించే ఏర్పాట్లు చేశాయి. కానీ ఇండియాలో అలాంటి విధానం లేదు. మృతదేహాన్ని సరుకుగా రవాణా చేయడం నాకు బాధనిపిస్తుంటుంది. బరువును బట్టి టారిఫ్ కాకుండా కాస్త మానవతా దృక్పథంతో ఆలోచించాలి. భారత ప్రభుత్వం ఇందుకోసం చర్యలు తీసుకుంటే మంచిది' అని చెబుతుంటాడు.