‘ఇండియన్ వర్కర్స్ చెత్తగాళ్లు’: మైన్ గవర్నర్ పైత్యం
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ కోసం వివిధ పార్టీల తరపున పోటీ పడుతున్న అభ్యర్థులు భారత్, భారతీయులపై ఉన్న అక్కసును ఎన్నికల ప్రచారంలో వెళ్లగక్కుతున్నారు. ఇప్పటికే వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ పత్రికల్లో పతాక శీర్షికల్లోకి ఎక్కుతున్న విషయం తెలిసిందే.
తాజాగా, అమెరికాలో మరో రిపబ్లికన్ నేత భారతీయులపై నోరుజారారు. భారతీయ కార్మికులను అర్థం చేసుకోవడం అత్యంత దుర్లభమని మైన్ రిపబ్లికన్ గవర్నర్ పాల్ లిపేజ్ వ్యాఖ్యానించారు. వివాదాస్పద వ్యాఖ్యలకు మారుపేరైన లిపేజ్... మైన్ రిపబ్లికన్ల సదస్సులో ఆదివారం మాట్లాడారు.
'భారతీయ ఉద్యోగులు చెత్తగాళ్లు.. వారిని అర్థం చేసుకోవడం చాలా కష్టం. వారితో మాట్లాడాలంటే అనువాదకుడు ఉండాల్సిందే' అని అన్నాడు. దీనిపై తీవ్రస్థాయిలో నిరసనలు రావడంతో ఆయన తేరుకుని సారీ చెప్పారు. భారత్ గొప్ప దేశమంటూ కొనియాడారు.
భారతీయులు ప్రియమైనవారని కూడా లిపేజ్ వ్యాఖ్యానించడం గమనార్హం. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి రిపబ్లికన్ల తరఫున ముందంజలో ఉన్న డోనాల్డ్ ట్రంప్ భారతీయులను లక్ష్యంగా చేసుకొని కాల్సెంటర్లను అవహేళన చేస్తూ శనివారం మాట్లాడిన సంగతి తెలిసిందే.