ఉగ్రవాదం, అవినీతిలపై పోరు ఆగదు: ఫ్రాన్స్లో ప్రధాని మోడీ ప్రసంగం
ప్యారిస్: 2019 లోక్సభ ఎన్నికల్లో ప్రజలు తమకు కనీవినీ ఎరుగని విజయాన్ని అందించారని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. అయితే అది ప్రభుత్వ ఏర్పాటు కోసమే ఇచ్చిన తీర్పు కాదని నవభారత నిర్మాణం చేయాలంటూ ప్రజలు తీర్పు ఇచ్చారని గుర్తుచేశారు ప్రధాని. ఫ్రాన్స్లో భారతీయులను ఉద్దేశించి ప్రసంగించారు. ఉగ్రవాదంపై పోరు ఒక్క భారత్లోనే చేయలేదని ఫ్రాన్స్ గడ్డపై కూడా ఉగ్రవాదంను భారత్ ఎదుర్కొందని మోడీ అన్నారు. 1950 మరియు 1960లో ఫ్రాన్స్లో రెండు ఎయిరిండియా విమానాలు ప్రమాదానికి గురయ్యాయి. నాటి జ్ఞాపకాలకు సంబంధించి ఓ మెమోరియల్ను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడిన ప్రధాని మోడీ భారత్లో అవినీతి, ప్రజల సొమ్మును లూటీ చేయడం, ఉగ్రవాదంలపై పోరాడుతున్నట్లు ప్రధాని చెప్పారు.
భారత్లో ఇక తాత్కాలికం అనేది ఏది ఉండకూదన్న ప్రధాని అందుకే జమ్మూకశ్మీర్లో ఆర్టికల్ 370ని రద్దు చేశామని చెప్పారు. భారత గడ్డపై మహాత్మా గాంధీ, గౌతమ బుద్ధ, రాముడు, కృష్ణుడులాంటి వారు జన్మించారని అలాంటి గడ్డపై ఏదీ తాత్కాలికం ఉండేందుకు వీలులేదని చెప్పారు ప్రధాని. ఇక అభివృద్ధిలో భారత్ వేగంగా దూసుకెళుతోందని అన్నారు ప్రధాని. ట్రిపుల్ తలాక్ గురించి ప్రస్తావించిన ప్రధాని మోడీ ముస్లిం మహిళలు ఎదుర్కొంటున్న అన్యాయంపై బిల్లు తీసుకొచ్చి వారికి అన్యాయం జరగకుండా చూశామని చెప్పారు.
ఇక 2030 నాటికి వాతావరణ మార్పులకు సంబంధించిన చాలామటుకు లక్ష్యాలను చేరుకుంటుందని ప్రధాని మోడీ చెప్పారు. 2025 నాటికి భారత్లో ట్యూబర్కొలాసిస్ రహిత దేశంగా ఆవిర్భవిస్తుందని చెప్పారు. ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలతో యువత, రైతులు, పేదలు ఇలా ప్రతిఒక్కరూ లబ్ది పొందారని చెప్పారు. అంతేకాదు భారత్లో పేదరికం నిర్మూలన త్వరలోనే జరగబోతోందని తమ ప్రభుత్వ పనితీరుని చూసి పలువురు తమ పరిశోధనల ద్వారా ప్రపంచానికి చాటుతున్నారని చెప్పారు ప్రధాని మోడీ. భారత్ ఫ్రాన్స్ దేశాలు ప్రతి రంగంలో భాగస్వామ్యంతో ముందుకు వెళుతున్నాయని... ఈ దేశంతో భారత్కు ప్రత్యేకమైన సంబంధాలు ఉన్నాయని కొనియాడారు ప్రధాని మోడీ. సోలార్ ఇన్ఫ్రా, టెక్నికల్ ఇన్ఫ్రా, స్పేస్ ఇన్ఫ్రా రంగాల్లో భారత్ ఫ్రాన్స్ది గొప్ప భాగస్వామ్యం అని ప్రధాని మోడీ చెప్పారు.