ట్రంప్ బాటలో భారత్, చైనా ఎలక్ట్రానిక్స్ కు చెక్! అసలెన్ని? కేంద్రం ఆరా, భద్రతకూ సవాలే!
డోక్లామ్ లో ఏర్పడిన ఉద్రిక్తత నేపథ్యంలో చైనాకు బుద్ధి చెప్పాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.
న్యూఢిల్లీ: ఇండియాకు చీప్గా ఎలక్ట్రానిక్స్, ఐటీ ఉత్పత్తులను ఎగుమతి చేస్తూ.. ఇక్కడి మార్కెట్ను పూర్తిగా కబ్జా చేసేసిన చైనాకు చెక్ పెట్టాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. చైనాతో వాణిజ్య వ్యవహారాలను సమీక్షించాల్సిందిగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆదేశాలు జారీ చేయగా, భారత్ కూడా ఇప్పుడు అదే దారిలో నడుస్తోంది.
చైనాకు షాక్ ఇచ్చిన ట్రంప్.. మండిపడిన డ్రాగన్, తేల్చుకుంటామంటూ వార్నింగ్
చైనా ఉత్పత్తుల ద్వారా మన దేశ భద్రతతోపాటు ఇతర కీలక విషయాలు లీకవుతున్నాయని భావిస్తున్న కేంద్రం.. చైనా ఎలక్ట్రానిక్స్, ఐటీ ఉత్పత్తుల దిగుమతులను పునఃసమీక్షించాలని నిర్ణయించింది. చైనాతో పెద్ద ఎత్తున ఉన్న వాణిజ్య లోటు కూడా ప్రభుత్వాన్ని ఈ దిశగా ఆలోచించేలా చేస్తోంది.
‘డోక్లామ్' వ్యూహంలో భాగమేనా...?
డోక్లామ్లో చైనా, భారత్ ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సమయంలో భారత్ ఈ నిర్ణయం తీసుకోవడం చూస్తే దుందుడుకుగా వ్యవహరిస్తున్న చైనాకు ఏదోవిధంగా బుద్ధి చెప్పాలని భారత్ కృత నిశ్చయంతో ఉన్నట్లు అర్థమవుతుంది. ఈ మధ్యే కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఓ అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించి.. భారత ఎలక్ట్రానిక్స్, ఐటీ రంగాల్లో చైనా ఉత్పత్తులపై ఆరా తీశారు. చైనా నుంచి వచ్చే దిగుమతులపై ఆంక్షలు విధించినా, వాటిని అడ్డుకున్నా.. ఆ చర్య ఆ దేశ ఆర్థిక వ్యవస్థ పై నేరుగా ప్రభావం చూపుతుంది.
మన వేల కోట్ల డాలర్లు.. చైనాకు!
భారత్లో చైనా ఎలక్ట్రానిక్స్, ఐటీ ఉత్పత్తుల విలువ చూస్తే కళ్లు తిరగక మానవు. ఇండస్ట్రీ చాంబర్ సీఐఐ లెక్కల ప్రకారం.. ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగంలో చైనాకు చెందిన 22 బిలియన్ (2200 కోట్లు) డాలర్ల విలువైన ఉత్పత్తులున్నాయి. ఇంత భారీ మొత్తం చూసి భారత ప్రభుత్వం కూడా కంగుతింది. భారత ఐటీ పరిశ్రమ ప్రస్తుతం 280 బిలియన్ డాలర్ల విలువను కలిగివుండగా, 2022 నాటికి ఇది ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా. ఈ నేపథ్యంలో చైనా ప్రాతినిధ్యాన్ని సాధ్యమైనంతగా తగ్గించాలని కేంద్రం భావిస్తోంది.
పొంచి ఉన్న పెనుముప్పు...!
చైనా నుంచి భారత్ కు దిగుమతి అవుతున్న ఎలక్ట్రానిక్స్, ఐటీ ఉత్పత్తుల వినియోగం వల్ల ఇక్కడి వ్యక్తులు, వ్యాపారాలు, ప్రభుత్వ విభాగాల కీలక సమాచారం చైనాకు లీక్ అవుతోందని ప్రభుత్వం భావిస్తున్నది. చైనా ఉత్పత్తులు ఇలాగే వాడుతూపోతే, దేశానికి చెందిన అత్యంత కీలక సమాచారం కూడా చైనాకు చేరుతుందనే అనుమానంతో ఇలా జరగకుండా అన్ని వ్యాపార సంస్థలు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే కేంద్రం ప్రభుత్వం ఆదేశాలు కూడా జారీ చేసింది.
చైనా సర్వర్లలో మన సమాచారం...!?
భారత్లోని ఎలక్ట్రానిక్స్ తయారీ రంగం చైనా కంపెనీలపై ఆధారపడింది. వీటిలో మొబైల్ ఫోన్లు, మందులు, టెలికాం నెట్వర్క్, డివైస్లు, సెన్సర్లు ఉన్నాయి. భారత ఆన్లైన్ మార్కెట్లలోనూ చైనా కంపెనీలు ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి. అయితే ఇందులో చాలావరకు డివైస్లు సమాచారాన్ని చైనా సర్వర్లలో నిక్షిప్తం చేస్తున్నాయి. ఈ డివైస్ల నుంచి ఆన్లైన్ ట్రాన్సక్షన్స్ చేసిన సమయంలోనూ కీలక సమాచారం చైనా సర్వర్లకు చేరిపోతోంది. ఇది భద్రతా సమస్యలకు దారి తీస్తుంది.
సోషల్ మీడియాలోనూ డిమాండ్...
మరోవైపు దేశంలో చైనా వస్తువులను బహిష్కరించాని, అసలు చైనా ఉత్పత్తులను దేశంలోకి రానివ్వరాదనే డిమాండ్ పెరుగుతోంది. ఈ మేరకు సోషల్ మీడియాలో ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రధాని నరేంద్ర మోడీ ‘మేకిన్ ఇండియా'లో భాగంగా ఆయా ఉత్పత్తులను మన దేశంలోనే తయారు చేసుకోవాలనే ఆకాంక్ష వెల్లువెత్తుతోంది. చైనాను దెబ్బ తీయాలంటే.. ఆ దేశం నుంచి దిగుమతి అవుతున్న వస్తువులను అడ్డుకుని తీరాలనే వాదన కూడా వినిపిస్తోంది. చైనా దిగుమతులను నిషేధించాలని, కుదరని పక్షంలో సుంకాలను భారీగా పెంచాలని పలువురు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చైనాకు చెక్ చెప్పేందుకు క్రమంగా ప్రభుత్వం కూడా ఈ దిశగా కదులుతోంది.
అసలేం దిగుమతి అవుతున్నాయి...
అసలు చైనా నుంచి మన దేశానికి దిగుమతి అవుతున్న వస్తువులేంటన్న విషయాన్ని తేల్చేందుకు ఐటీ, న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్, ఇటీవల ఓ ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఇండియాలో ఉత్పత్తి రంగాన్ని ప్రోత్సహించడం ద్వారా చైనా ప్రొడక్టులకు చెక్ చెప్పవచ్చని పలువురు అధికారులు అభిప్రాయపడ్డారు. అయితే ఇది అనుకున్నంత త్వరగా జరిగేది కాదని, ఇందుకు సుదీర్ఘ సమయం పడుతుందని వారు పేర్కొన్నారు. ఇండియాలో అతిపెద్ద ఆన్ లైన్ మార్కెట్ ప్లేస్ లో సైతం చైనా కంపెనీలు చెప్పుకోతగ్గ వాటాలను కలిగివుండటం, డేటా సర్వర్లు చైనాలో ఉండటం దేశానికి ప్రమాదకరమన్న అభిప్రాయం కూడా ఈ రివ్యూ మీటింగ్ లో వెల్లడైంది.
ఆ వస్తువులే అధికం...
ఇండస్ట్రీ చాంబర్ సీఐఐ లెక్కల ప్రకారం, ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగంలో.. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్ మార్కెట్లో చైనా కంపెనీలు దూసుకెళుతున్నాయి. ఆన్ లైన్ వాణిజ్య మాధ్యమాల ద్వారా నిత్యమూ కోట్లాది రూపాయల ఆదాయాన్ని చైనా కంపెనీలు పొందుతున్నాయి. చిన్న చిన్న బొమ్మల నుంచి పెద్ద పెద్ద పరికరాల వరకూ ఎన్నో చైనాలో తయారైన వస్తువులు భారత మార్కెట్లో ఉన్నాయన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఫోన్లతో పాటు వైద్య రంగంలో ఉపకరించే పరికరాలు, టెలికం నెట్ వర్క్ పరికరాలు, ఐఓటీ (ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్) డివైస్ లు ప్రధాన స్థానాన్ని ఆక్రమించుకుని ఉన్నాయి.