మోదీకి ట్రంప్ షాకిచ్చారంటూ పాకిస్తాన్లో సంబురాలు.. అక్కసు వెళ్లగక్కిన అఫ్రిది
''బీజేపీ సర్కారు ఎంతో శ్రమకోర్చి అహ్మదాబాద్ లో అట్టహాసంగా 'నమస్తే ట్రంప్' ఈవెంట్ నిర్వహిస్తే.. అమెరికా అధ్యక్షుడు మాత్రం పాకిస్తాన్ పై పొగడ్తల వర్షం కురిపించారు. ఇండియాలో డైవర్సిటీపైనా ప్రధాని మోదీకి చురకలు వేశారు'' అంటూ పాకిస్తానీలు తెగ సంబరపడిపోతున్నారు. మంగళవారం అక్కడి ప్రధాన పత్రికలన్నీ ఇదే తరహా వార్తల్ని ప్రచురించాయి.
పాకిస్తాన్ తో దోస్తీ కొనసాగిస్తామన్న ట్రంప్ వ్యాఖ్యలను పాక్ మీడియా హైలైట్ చేసింది. ట్రంప్ ప్రకటనపై పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కూడా అధికారికంగా స్పందిస్తారని తెలుస్తోంది. మరోవైపు, భారత్-పాకిస్తాన్ సంబంధాల విషయంలో ప్రధాని మోదీ పాత్రను ప్రస్తావిస్తూ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఖర్చు మీకు.. కిక్కు మాకు..
పాకిస్తాన్ లో అతిపెద్ద ఇంగ్లీష్ పత్రిక డాన్ తన మంగళవారం నాటి సంచికకు ‘‘ఇండియా గడ్డపై నిలబడి పాకిస్తాన్ను పొగిడిన ట్రంప్''అని శీర్షిక పెట్టింది. సెక్యూలరిజం విషయంలో మోదీకి ట్రంప్ సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారని ఆ పత్రిక పేర్కొంది. మరో ప్రధాన పత్రిక ‘ది న్యూస్ ఇంటర్నేషనల్' మరో అడుగు ముందుకేసి.. ‘‘పాకిస్తాన్ తో దోస్తీ కొనసాగిస్తామన్న ప్రకటనతో ట్రంప్.. మోతేరా స్టేడియంలోని లక్షమందికి ఒకేసారి షాకిచ్చారు''అని రాసుకొచ్చింది. చిన్నాచితకా పత్రికలు, వెబ్ సైట్లయితే ‘ఖర్చు ఇండియాకు.. కిక్కు పాకిస్తాన్ కు' తరహాలో పిచ్చిరాతలు రాశాయి.
పీఎంవోలో సంబురాలు?
ట్రంప్ భారత పర్యటనను నిశితంగా గమనిస్తోన్న ఇమ్రాన్ ఖాన్ సర్కారుకు.. సోమవారం నాటి ట్రంప్ ప్రసంగంతో ఎక్కడలేని జోష్ వచ్చినట్లు పాక్ మీడియా పేర్కొంది. ఇండియాలో నమస్తే ట్రంప్ ఈవెంట్ ముగిసిన తర్వాత.. పాక్ ప్రధాని కార్యాలయంలోనూ చిన్నపాటి సంబురాలు జరుపుకున్నట్లు రిపోర్టు వచ్చాయి.
మోదీ వల్లే ఆగమాగం
నరేంద్ర మోదీ అనే ఒకేఒక వ్యక్తి వల్ల భారత్, పాకిస్తాన్ సంబంధాలకు బీటలు ఏర్పడ్డాయని మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది అన్నారు. బీజేపీ అధికారంలో ఉన్నంతకాలం పరిస్థితి చక్కబడే అవకాశమేలేదని అభిప్రాయపడ్డారు. ఓ మీడియా సంస్థకు సోమవారం ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయనీ కామెంట్లు చేశారు. రెండు దేశాల మధ్య క్రికెట్ తో సహా అన్ని సంబంధాలు మోదీ ఉన్నంత కాలం ముందుకుపోలేవన్నారు.
నెగటివ్ మైండ్సెట్..
‘‘చరిత్ర పొడవునా కలిసేఉండి, 70 ఏళ్ల క్రితం విడిపోయాం. భారత్, పాకిస్తాన్ ప్రజలు స్వేచ్ఛగా సరిహద్దులు దాటాలని కోరుకుంటారు. కానీ దాన్ని అమలు కానివ్వొద్దన్నదే మోదీ అజెండాగా కనిపిస్తోంది. ఆయనది నెగటివ్ మైండ్సెట్.. అది రోజురోజుకూ ఇంకా దిగజారుతోంది''అని అఫ్రిది అక్కసు వెళ్లగక్కారు. భారత క్రికెట్ జట్టు చివరిసారిగా 2006లో పాకిస్తాన్ లో పర్యటించగా, ఆ దేశ క్రికెట్ జట్టు 2012-13లో ఇండియాకు వచ్చింది. ఆ తర్వాత రెండు జట్ల మధ్య నేరుగా మ్యాచ్ లు జరగలేదు. వరల్డ్ కప్ ఈవెంట్ లో మాత్రమే తలపడుతున్నాయి.