కశ్మీర్ అంశంపై ట్రంప్ ఇస్తున్న ఆఫర్ ఏంటి..? మళ్లీ తుట్టెను కదుపుతున్నారా..?
వాషింగ్టన్ : జమ్మూ కశ్మీర్ అంశంలో తాము మధ్యవర్తిత్వం వహించేందుకు ఇంకా సిద్ధంగానే ఉన్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్పారు. గత నెలలో ట్రంప్ - మోడీ భేటీ సందర్భంగా కశ్మీర్ అంశం ద్వైపాక్షిక అంశం అని ఇరు నేతలు చెప్పిన విషయం తెలిసిందే. వైట్హౌజ్లో మీడియాతో మాట్లాడిన ట్రంప్... భారత్కు కశ్మీర్ అంశంలో సహాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఆ ఆఫర్ కూడా ఏమిటో భారత్కు తెలుసని ట్రంప్ వ్యాఖ్యానించారు. అంతేకాదు భారత్ పాకిస్తాన్లతో తనకు మంచి సంబంధాలున్నాయని పునరుద్ఘాటించారు.
జమ్మూకశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్ అంశంలో భారత్కు పాక్కు మధ్య కొన్ని వివాదాలు తలెత్తిన మాట వాస్తవమేనని చెప్పిన ట్రంప్... ఇప్పుడు అక్కడ ఉద్రిక్తత వాతావరణం చాలామటుకు తగ్గిందని చెప్పారు. రెండు వారాల క్రితంతో పోలిస్తే పరిస్థితులు చాలావరకు అదుపులోకి వచ్చాయని వెల్లడించారు. జీ7 సమ్మిట్కు మోడీ ప్రత్యేక ఆహ్వానితులుగా వెళ్లారు. ఆ సమయంలో డొనాల్డ్ ట్రంప్తో భేటీ అయ్యారు. కశ్మీర్ అంశం భారత అంతర్గత విషయమని రెండు దేశాలు చర్చించుకుని ఒక నిర్ణయానికి వస్తాయనే ఆశాభావం వ్యక్తం చేశారు ఇరే దేశాధినేతలు.
భారత్ అమెరికా దేశాధినేతల సంయుక్త ప్రకటన తర్వాత కశ్మీర్ కోసం అణుయుద్ధానికైనా తాము సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించి పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కలకలం సృష్టించారు. ఈ ఏడాది జూలైలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ను ఇమ్రాన్ఖాన్ కలిసిన సందర్భంలో తాను రెండు దేశాల మధ్య మధ్యవర్తిత్వం వహించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. అంతేకాదు రెండు దేశాల మధ్య జోక్యం చేసుకోవాలంటూ ప్రధాని నరేంద్ర మోడీ తనను కోరారంటూ ప్రకటించడంతో భారత్లోని రాజకీయపార్టీలు భగ్గుమన్నాయి. అయితే కశ్మీర్ అంశంలో ట్రంప్ను జోక్యం చేసుకోవాల్సిందిగా ప్రధాని మోడీ ఎప్పుడూ కోరలేదంటూ ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. అంతేకాదు విదేశాంగ మంత్రి జైశంకర్ అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ మైక్ పాంపేను కలిసి సమయంలో కశ్మీర్ అంశం భారత అంతర్గత విషయమంటూ ఇందులో ఎవరీ జోక్యం అవసరం లేదని తెలిపారు.