ఇంట్లోకి దూసుకెళ్లిన విమానం: ముగ్గురు మృతి
నేపిడ/జకర్తా: ఇండోనేసియాలో బుధవారం ఉదయం విమానం ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించారు. జావా దీవిలోని అబ్దుల్ రాచ్మన్ సలేహ్ ఎయిర్ఫోర్స్ బేస్ నుంచి బుధవారం ఉదయం ఓ శిక్షణ విమానం గాలిలోకి ఎగిరింది. దాదాపు 40 నిమిషాల ప్రాక్టీస్ అనంతరం విమానానికి ఎయిర్ బేస్తో సంబంధాలు తెగిపోయాయి.
దీంతో విమానం ఎక్కడున్నదీ గుర్తించలేకపోయామని, అర గంట తర్వాత నగరంలో అత్యంత రద్దీగా ఉండే నివాస ప్రాంతంలో అది కూలిపోయినట్లు గుర్తించామని వైమానిక అధికారులు చెప్పారు. అదుపు తప్పిన విమానం నేరుగా ఓ ఇంట్లోకి దూసుకెళ్లడంతో ఆ ఇంటి యజమాని, యజమానురాలు సహా పైలట్ కూడా మృత్యువాతపడ్డాడు.
ఈ ప్రమాదంలో మృతదేహాలు పూర్తిగా కాలిపోయాయి. ప్రమాద ఘటనపై అధికారులు విచారణ చేపట్టారు. గత ఏడాది డిసెంబరులో సెంట్రల్ జావాలో రెండు మిలటరీ విమానం కూలి ఇద్దరు పైలెట్లు మృతి చెందిన విషయం తెలిసిందే.
కుప్పకూలిన సైనిక విమానం: నలుగురు మృతి
మయన్మార్ రాజధాని నేపిడాలో ఓ చిన్న మిలిటరీ విమానం కూలిపోయింది. ఈ ఘటనలో విమానంలో ప్రయాణిస్తున్న నలుగురు సిబ్బంది మృత్యువాతపడ్డారు. మొత్తం విమానంలో ఐదుగురు ప్రయాణిస్తున్నారని.. వారిలో నలుగురు మృతిచెందగా.. మరొకరు ప్రాణాలతో బయటపడినట్లు అధికారులు పేర్కొన్నారు.
విమానాశ్రయం నుంచి విమానం బయలుదేరిన కొద్ది సేపటికే కూలిపోయినట్లు అధికారులు పేర్కొన్నారు. విమానం కూలగానే మంటలు చెలరేగడంతో స్థానికులు సహాయ చర్యలు చేపట్టినట్లు సమాచారం.