చాన్ ప్రేమ పెళ్లి విషాదాంతం: నూతన వరుడితోపాటు 8మంది ఉరితీత
సిలాకాప్/కాన్బెర్రా: స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడి దోషిగా తేలిన ఆండ్రూ చాన్ తోపాటు మరో ఎనిమిది మందిని ఇండోనేషియా ప్రభుత్వం బుధవారం ఉదయం ఉరితీసింది. ఈ మేరకు స్థానిక మీడియా కథనాలను ప్రచురితం చేశాయి. స్మగ్లింగ్ కేసులో దోషిగా తేలిన ఆస్ట్రేలియాకు చెందిన ఆండ్రూ చాన్ తన చివరి కోరికగా తన ప్రియురాలిని రెండు రోజుల క్రితం వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.
ఆస్ట్రేలియాకు చెందిన ఆండ్రూ చాన్ డ్రగ్ స్మగ్లింగ్ కేసులో జైల్లో ఖైదీగా ఉన్నాడు. ఇతడితో సహా మొత్తం 8మంది 8.2 కేజీల హెరాయన్, 3.1 మిలియన్ల డాలర్ల నగదును ఇండోనేషియాకు అక్రమంగా రవాణా చేస్తూ 2005లో అరెస్టయ్యారు. నేరం రుజువు కావడంతో ఆండ్రూకు మరణ శిక్ష ఖరారయ్యింది. ఈ కేసునే బాలి నైన్ డ్రగ్ కేసుగా పిలుస్తారు.
అంతకుముందే ఫ్యాబియంతి హెరెవిల్లా అనే అమ్మాయితో ప్రేమలో ఉన్న ఆండ్రూచాన్ తన చివరి కోరికగా ఆమెను జైలులోనే సోమవారం పెళ్లి చేసుకున్నాడు. ఉరిశిక్ష సమీపిస్తుండటంతో అతడి తరుపున, ఆమె తరుపునవారంతా అటు ఇండోనేషియా ప్రభుత్వానికి, ఆస్ట్రేలియా ప్రభుత్వానికి కన్నీటిపర్యంతమవుతూ ఆండ్రూకు క్షమాభిక్ష పెట్టాల్సిందిగా వేడుకున్నారు. దీనిపై ఆస్ట్రేలియా అధికారులు ఇండోనేషియా అధికారులను సంప్రదించే ఆలోచనలు చేస్తుండగానే బుధవారం వారిని ఉరితీసినట్లు ప్రకటించారు.
దీంతో ఆండ్రూచాన్, హెరెవిల్లాల ప్రేమ పెళ్లి ఓ విషాదంగా మిగిలిపోయింది. నవ వధువు హెరెవిల్లాకు తీరని శోకం మిగిల్చింది. ఇక ఉరి తీయబడిన మిగితావారిలో ఇంకొకరు ఆస్ట్రేలియా వ్యక్తికాగా, నలుగురు ఆఫ్రికా, ఒకరు బ్రెజిల్ కు చెందినవారు.
తమ దేశానికి చెందిన ఇద్దరు పౌరులు ఆండ్రూచాన్, మిరాన్ సుకుమారన్లను ఇండోనేషియా ప్రభుత్వం ఉరి తీసిన కారణంగా ఆ దేశంలోని తమ విదేశాంగ రాయబారి జులీ బిషప్ను వెనుకకు వచ్చేయాల్సిందిగా ఆస్ట్రేలియా ప్రధాని టోని అబాట్ బుధవారం ఆదేశించారు.
ఇండోనేషియా సార్వభౌమత్వాన్ని తాము గౌరవిస్తామని, ఆ దేశంతో సంబంధాలు తమకు ముఖ్యమైనవేనని అయితే, కొన్ని గంటల క్రితం జరిగిన ఘటనలు తమను తీవ్రంగా బాధించాయని ఆయన పేర్కొన్నారు. ఇది క్రూరమైన చర్య అని అన్నారు.
మరోపక్క, ఇండోనేషియా చర్యను ఫ్రాన్స్, బ్రెజిల్, ఆఫ్రికా, నైజిరియా, ఫిలిప్పైన్స్ దేశాలు ఖండించాయి. ఇండోనేషియాలో కూడా ఉరిశిక్షలకు నిరసనగా భారీ ఎత్తున నిరసనలు చేపట్టారు. కాగా, తీవ్రమైన డ్రగ్ స్మగ్లింగ్ సమస్యను ఎదుర్కొంటున్న ఇండోనేషియా.. దోషులకు ఈ మేరకు కఠిన శిక్షలు అమలు చేసినట్లు తెలుస్తోంది.