ఇండోనేషియాను వణికించిన భూకంపం, రిక్టర్ స్కేలుపై తీవ్రత 6.1గా నమోదు
ఇండోనేషియాలో మంగళవారం సాయంత్రం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.1గా నమోదైంది. స్థానిక కాలమానం ప్రకారం.. సాయంత్రం 5.34 గంటల భూకంపం సంభవించింది.
జకర్తా: ఇండోనేషియాలో మంగళవారం సాయంత్రం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.1గా నమోదైంది. స్థానిక కాలమానం ప్రకారం.. సాయంత్రం 5.34 గంటల భూకంపం సంభవించింది.
ఈ భూకంపం కారణంగా చాలావరకు ఇళ్లు నేలమట్టమయ్యాయి. పదుల సంఖ్యలో తీవ్రంగా గాయపడ్డారు. 130 వరకు భవనాలు దెబ్బతిన్నాయి. వెంటనే రంగంలోకి దిగిన ప్రభుత్వ వర్గాలు శిథిలాల కింద చిక్కుకున్న ప్రజలను రక్షించేందుకు చర్యలు తీసుకుంటున్నాయి.
క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. భూకంప కేంద్రం దేశ రాజధాని జకర్తాకు 200 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైనట్లు అక్కడి అధికారులు తెలిపారు. 20 సెకన్ల పాటు భూమి ఊగిపోవడంతో జకర్తాలోని బిల్డింగ్లు ఆ ప్రకంపనలకు అటూ ఇటూ ఊగాయి.
దీంతో షాక్కు గురైన ప్రజలు భయంతో బయటకు పరుగులు తీశారు. ఈ భూకంపం సునామీగా మారే అవకాశం లేదని ఎటువంటి హెచ్చరిక జారీ చేయలేదని ఇండోనేషియా డిపార్ట్ మెంట్ ఆఫ్ మెటియోరాలజి, క్లైమెట్ అండ్ జియో ఫిజిక్స్ తెలిపింది.
భూకంపం సంభవించినప్పుడు జకార్తాలో ఎత్తైన భవనాల్లోని ఉద్యోగులందరూ ప్రాణ భయంతో వీధుల్లోకి పరిగెత్తారు. ఆస్పత్రుల నుండి రోగులు కూడా పరుగులు పెట్టారు. భూమిలో సుకబూమి నగరానికి 104కిలోమీటర్ల దూరంలో 33కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం వుంది.
మూడు నుండి ఐదు నిముషాల పాటు భూమి కంపించిందని చిలీ ఎంబసీలో పనిచేస్తున్న రూడీ తెలిపారు. కూర్చుని ఉండగా భవనం ఊగుతున్నట్లు అనిపించిందని, అత్యవసర ద్వారాలు, మెట్లు చాలా ఇరుకుగా ఉండడంతో బయటకు వచ్చేవరకు చాలా ఆందోళన చెందినట్లు తెలిపారు.
ప్రపంచంలోకెల్లా అత్యంత ఎక్కువగా భూకంపాలు సంభవించే ప్రాంతం ఇండోనేషియా. 2004లో వచ్చిన సునామీలో కేవలం ఇండోనేషియాలోనే లక్షా 20 వేలమంది మృత్యువాత పడ్డారు.