ఇండోనేసియా భూకంపం: 42కు పెరిగిన మృతులు -వందల ఇళ్లు ధ్వంసం -చీకట్లో సులవేసి దీవి
ఆగ్నేయాసియాలో అత్యధిక జనాభా కలిగిన ఇండోనేసియా దేశంలో శుక్రవారం భారీ భూకంపం సంభవించింది. సులవేసి దీవిలో చోటుచేసుకున్న ఈ విపత్తులో మృతుల సంఖ్య 42కు పెరిగింది. భూకంపం ధాటికి పెద్ద సంఖ్యలో ఇళ్లు నేలమట్టమై.. వందలాది మంది గాయపడ్డారు. భవన శిథిలాల కింద అనేక మంది చిక్కుకుపోయారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముంది. వివరాల్లోకి వెళితే..
Recommended Video
బీజేపీకి పవన్ షాకిస్తారా? సరెండరా? తిరుపతి ఉప ఎన్నికపై 21న కీలక నిర్ణయం -వకీల్ సాబ్ దూకుడు చూస్తే
ప్రపంచంలోనే అతి పెద్ద దీవుల్లో ఒకటిగా, ఇండోనేసియాలో అంతర్బాగంగా ఉన్న సులవేసి దీవిలో.. స్థానిక కాలమానం ప్రకారం.. అర్ధరాత్రి ఒంటిగంట తర్వాత భూకంపం సంభవించింది. 6.2 తీవ్రతతో దాదాపు 7 సెకన్ల పాటు భూమి కంపించింది. భూకంపం ధాటికి 62 భవనాలు కుప్పకూలినట్లు ఇండోనేసియా డిజాస్టర్ మిటిగేషన్ ఏజెన్సీ వెల్లడించింది. ప్రజలు గాఢ నిద్రలో ఉన్న సమయంలో భూకంపం సంభవించడంతో చాలా మంది శిథిలాల కిందే చిక్కుకుపోయారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
ఇండోనేసియా భూకంపం ధాటికి ఇప్పటివరకు 42 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఏజెన్సీ చీఫ్ డార్నో మజీద్ తెలిపారు. భవనాలు నేలమట్టమవడంతో చాలా మంది చిక్కుకుపోయారని, దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశమున్నట్లు చెప్పారు. డిజాస్టర్ ఏజెన్సీ సమాచారం ప్రకారం.. మజెని ప్రాంతంలో 637 మంది, మముజు ప్రాంతంలో 20 మందికి పైగా గాయపడ్డారు. ప్రకంపనల కారణంగా విద్యుత్ స్తంభాలు దెబ్బతినడంతో సులవేసి దీవిలోని చాలా ప్రాంతాలు ఇంకా చీకట్లోనే ఉండిపోయాయి. కాగా..
మోదీ సాబ్.. మా బాకీ ఇప్పించండి -ఇబ్బందుల్లో ఉన్నాం -కేంద్రానికి హైదరాబాద్ నిజాం మనవడి విజ్ఞప్తి
గురువారం కూడా ఇదే ప్రాంతంలో 5.9 తీవ్రతతో భూమి కంపించింది. ఇక్కడ గడిచిన 24 గంటల్లో 26 సార్లు భూప్రకంపనలు చోటుచేసుకోవడంతో మూడు చోట్ల కొండ చరియలు విరిగిపడ్డాయి. దీంతో పలు ప్రాంతాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. 'రింగ్ ఆఫ్ ఫైర్' ఇండోనేసియాలో భూకంపాలు తరచుగా సంభవిస్తుంటాయి. 2018లో ఇదే సులవేసి దీవిలో 6.2 తీవ్రతతో భారీ భూకంపం సంభవించి సునామీ వచ్చింది. ఆ ప్రకృతి విపత్తులో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు.