ఇండోనేషియాలో భారీ భూకంపం, 25 ప్రకంపనలు, 82 మంది మృతి
Recommended Video
బాలి: ఇండోనేషియా లంబోక్ దీవుల్లో భారీ భూకంపం (స్థానిక ఇండోనేషియా కాలమానం ప్రకారం ఆదివారం సాయంత్రం) సంభవించింది. రిక్టర్ స్కేల్ పైన 6.9గా నమోదయింది. భూకంపం కారణంగా 82 మంది వరకు మృతి చెందారు. వేలాదిమంది గాయపడ్డారు. భూకంపం తర్వాత కూడా కొన్ని ప్రకంపనలు వచ్చాయి.
భూకంపం దాటికి కొండచరియలు విరిగిపడ్డాయి. వందలాది ఇళ్లు ధ్వంసమయ్యాయి. ప్రజలు భయంతో ఇళ్లను వదిలి బయటకు పరుగులు పెట్టారు. భూకంప కేంద్రం భూమిపై నుంచి కేవలం 10 కిలోమీటర్ల లోతున ఉన్నట్లు జియలాజికల్ సర్వే వెల్లడించింది.
ఈ భూకంపం తర్వాత కూడా రెండుసార్లు స్వల్పంగా భూకంపం వచ్చింది. దాదాపు 25 ప్రకంపనలు వచ్చాయి. అధికారులు తొలుత సునామీ హెచ్చరిక జారీ చేసి, ఆ తర్వాత ఉపసంహరించుకున్నారు. ఈ భూకంపం తీవ్రతకు దాదాపు 900 కి.మీ దూరంలోని బాండుంగ్ నగరంలో నష్టం వాటిల్లింది.
బాలి ద్వీపంలో భూకంపం తీవ్రత ఎక్కువగా కనిపించింది. వారం రోజుల క్రితమే లాంబాక్లో 6.4 తీవ్రతతో భూకంపం వచ్చింది. పలువురు మృతి చెందారు. పసిఫిక్ సముద్రంలోని రింగ్ ఆఫ్ ఫైర్ ప్రాంతంలో ఉన్న ఇండోనేషియాలో తరుచూ భూకంపాలు సంభవిస్తుంటాయి.
ఇక్కడ టెక్టానిక్ ఫలకలు పరస్పరం ఢీకొంటాయి. అగ్ని పర్వతాలు బద్దలయి లావా పొంగుతుంటుంది. 2004లో ఇండోనేషియాలోని సుమత్ర వద్ద సముద్ర గర్భంలో 9.3 తీవ్రతో వచ్చిన భూకంపం పెను విధ్వంసాన్ని సృష్టించింది. ఈ భూకంపానికి సునామీ వచ్చి హిందూ మహాసముద్రం వ్యాపించి ఉన్న దేశాల్లో 2,20,000 మంది మరణించారు. ఒక్క ఇండోనేషియాలోనే 1,68,000 మంది మరణించారు.