ఇండోనేషియా తీరం తాకిన సునామీ: బీభత్సం సృష్టిస్తున్న భారీ అలలు, నివాసాలు ధ్వంసం(వీడియో)
జకార్తా: ఇండోనేషియాలో శుక్రవారం భారీ భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. భూకంప తీవ్రత 7.5గా రిక్టారు స్కేలుపై నమోదైంది. భూకంపం కారణంగా ఇద్దరు మృతి చెందంగా, భారీ ఆస్తి నష్టం జరిగింది. కాగా, శుక్రవారం రాత్రి సమయంలో సునామీ ఇండోనేషియా తీరాన్ని తాకి బీభత్సం సృష్టించింది.
ఇండోనేసియాలో భారీ భూకంపం, 7.5 తీవ్రత, సునామీ హెచ్చరికలు
భారీ అలలు దూసుకురావడంతో తీరం వెంబడి ఉన్న నివాసాలు చాలా వరకు ధ్వంసం అయ్యాయి. దీంతో, ప్రజలు భయంతో నివాసాల నుంచి బయటకు పరుగులు తీశారు. ఆ ప్రాంతాలను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతానికి తరలివెళుతున్నారు. ఇప్పటి వరకు ఒకరు మృతి చెందగా, పదుల సంఖ్యలో గాయాలపాలయ్యారు.
సునామీ బీభత్సంతో అనేక ఇళ్లు ధ్వంసం కాగా, వందలాది వాహనాలు కొట్టుకుపోయాయి. ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అధికారులు, భద్రతాదళాలు సహాయక కార్యక్రమాలను ముమ్మరం చేశారు.
This footage shows the catastrophic moment when #tsunami hit the city of Palu after 7.7 magnitude #earthquake shook the city this evening. #prayforpalu #prayforindonesia pic.twitter.com/I8JBi4dZjz
— Ramadhani Eko P (@ramadhaniep) September 28, 2018
పౌలు నగరంలోని ప్రజలను రక్షించేందుకు అధికారులు సహాయక బృందాలను పంపించినట్లు ఇండోనేషియా మీడియా వర్గాలు వెల్లడించాయి. 2004 తర్వాత ఇండోనేషియా దీవుల్లో సునామీ రావడం ఇదే తొలిసారి. అప్పుడు సంభవించిన సునామీ కారణంగా దాదాపు 2,20,000 మంది ప్రాణాలు కోల్పోగా వారిలో 1,68,000 మంది ఇండోనేషియా వాసులే ఉన్నారు. 7.5 తీవ్రతతో సులవెసి ప్రాంతంలో భూకంపం సంభవించిన వెంటనే అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. కానీ కొద్ది సేపటికే వాటిని వెనక్కి తీసుకున్నారు.
అయితే అధికారులు హెచ్చరికలను వెనక్కి తీసుకున్న కాసేపటికే పౌలు నగరాన్ని సునామీ ముంచేసింది. సునామీ సంభవించిన విషయాన్ని అక్కడి అధికారులు ధ్రువీకరించారు. కాగా, స్థానిక ఇండోనేసియా కాలమానం ప్రకారం శుక్రవారం ఆరు గంటలకు ఈ భూకంపం సెంట్రల్ సులవేసి సమీపంలో వచ్చింది. భూకంపం, సునామీల కారణంగా మృతి చెందిన వారి సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.