బాణాసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుళ్లు: 47మంది సజీవ దహనం
ఇండోనేషియాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఓ బాణాసంచా కర్మాగారంలో పేలుడు సంభవించడంతో 47మంది సజీవ దహనమయ్యారు. గురువారం ఉదయం 9 గంటలకు ఈ ఘటన చోటుచేసుకుంది.
జకార్తా: ఇండోనేషియాలో గురువారం ఉదయం 9గంటల ప్రాంతంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఓ బాణాసంచా కర్మాగారంలో పేలుడు సంభవించడంతో 47మంది సజీవ దహనమయ్యారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జకార్తా సమీపంలోని తంగెరాంగ్ ప్రాంతంలో గల ఓ బాణసంచా ఫ్యాక్టరీలో గురువారం ప్రమాదవశాత్తు పేలుడు సంభవించింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి భవనమంతా వ్యాపించాయి. ఈ ఘటనలో 47 మంది సజీవ దహనమయ్యారు. పదుల సంఖ్యలో గాయాలపాలయ్యారు.
సమాచారమందుకున్న అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. ఘటన సమయంలో ఫ్యాక్టరీలో 103 మంది సిబ్బంది పనిచేస్తున్నట్లు అధికారులు తెలిపారు. మృతదేహాలు గుర్తుపట్టడానికి వీల్లేకుండా పూర్తిగా కాలిపోయినట్లు చెప్పారు.
గాయపడ్డ 43మందిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. కాగా, మంటల ధాటికి భవనం చాలా వరకూ కుప్పకూలింది. పక్కనే ఉన్న కార్లు కూడా దగ్ధమయ్యాయి. ఫైరింజన్లు మంటలను పూర్తిగా ఆర్పీవేశాయి.