ఇండోనేషియా విమాన ప్రమాదం: దొరికిన బ్లాక్ బాక్స్ ...అందులో ఏముంది..?
కొద్ది రోజుల క్రితం సముద్రంలో కూలిపోయిన ఇండోనేషియాకు చెందిన లైన్ ఎయిర్ జెట్ విమానంకు సంబంధించి బ్లాక్బాక్స్ను కనుగొన్నారు అధికారులు. 189 మంది ప్రయాణిస్తున్న ఈ విమానం టేకాఫ్ అయిన 13 నిమిషాలకే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్తో సంబంధాలు తెగిపోయాయి. దీంతో విమానం సముద్రంలో కూలిపోయింది. మొత్తం 189 మంది ప్రయాణికులు జలసమాధి అయ్యారు.
ఇక బ్లాక్ బాక్స్ దొరకడంతో విచారణ సులభతరం అవుతుందని అధికారులు వెల్లడించారు. విమానం గ్రౌండ్ సిబ్బందితో సంబంధాలు తెగిపోయాక విమానంలో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయనేది తెలుస్తుందని అన్నారు. విమానం విడిబాగాలు సముద్రం కింద ఇసుకలో ఇరుక్కుపోయాయని అది నారింజ రంగులో ఉండటంతో దాన్ని తవ్వి తీసి చూస్తే విమానం బ్లాక్ బాక్స్ అని డైవర్స్ తెలిపారు. అయితే ఇది ఫ్లైట్ డాటా రికార్డరా లేక కాక్పిట్ వాయిస్ రికార్డరా అనేది తెలియాల్సి ఉందని చెప్పారు. ఈ రెండిటిని బ్లాక్ బాక్స్ అనే పిలుస్తారని అధికారులు స్పష్టం చేశారు.
అయితే విమానంకు సంబంధించి చాలా చిన్న ముక్కలు మాత్రమే దొరికాయని అధికారులు తెలిపారు. కొత్త బోయింగ్ విమానం 737 మ్యాక్స్ 8 జెట్కు సంబంధించి బ్లాక్ బాక్స్ సముద్రంలో 35 అడుగుల లోతులోకి ఎలా వెళ్లింది అనేది కూడా తెలుస్తుందని చెప్పారు. సముద్రం కింద ఒక వస్తువును డ్రోన్లు గుర్తించాయని అక్కడికి వెళ్లి డైవర్లు దాన్ని బయటకు తీసినట్లు చెప్పారు.
ఇదిలా ఉంటే సముద్రంలో అలలు ఎగిసి పడుతుండటంతో సెర్చ్ ఆపరేషన్స్కు విఘాతం ఏర్పడిందని అధికారులు తెలిపారు. అయితే విమానం ఎక్కడైతే కూలిపోయిందో అక్కడే డైవర్స్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారని... విమనాం అదే ప్రాంతంలో కూలిపోయిందనే నిర్ధారణకు వచ్చినట్లు అధికారులు స్పష్టం చేశారు. ఇక్కడే వారికి ప్రయాణికులు ధరించిన లైఫ్ జాకెట్లు, ప్యాంట్లు, మ్యాగజీన్లు దొరికినట్లు చెప్పారు. ఇక విమానం శకలాలు దొరికితే క్రేన్ సహకారంతో వాటిని వెలికి తీస్తామని చెప్పారు. అక్కడే చాలావరకు మృతదేహాలు ఇరుక్కుని ఉంటాయన్న అనుమానం వ్యక్తం చేశారు అధికారులు.