ఇండోనేషియా విమాన ప్రమాదం: బ్లాక్ బాక్సుల గుర్తింపు, సముద్రంలో తేలిన శవాలు
జకార్తా: ఇండోనేషియా విమానం అదృశ్యమైన ఘటన విషాదాంతమైంది. శనివారం మధ్యాహ్నం అదృశ్యమైన ఇండోనేషియా విమానానికి చెందిన రెండు బ్లాక్ బాక్సుల ఆచూకీ లభ్యమైంది. సిగ్నల్స్ను బట్టి వాటిని త్వరలోనే వెలికితీస్తామని చెప్పారు. జకార్తాలో బయల్దేరిన ఎస్జే 182 విమానం టేకాఫ్ అయిన కొద్ది నిమిషాల్లోనే ఆచూకీ లేకుండా పోయింది.
ఆ తర్వాత ఆదివారం ఉదయం లాంకాంగ్, లకీ ద్వీపాల మధ్య ఈ విమాన శకలాలు, మనుషుల శరీర భాగాలు, దుస్తులు తదితర వస్తువులు లభ్యమయ్యాయి. దీంతో ఈ విమానం కూలిపోయి ఉంటుందని ప్రాథమికంగా నిర్ధారించారు. శ్రీవిజయ ఎయిర్కు చెందిన ఈ విమానం ఏడుగురు చిన్నారులు, ముగ్గురు శిశువులు, సిబ్బందితో సహా మొత్తం 62 మంది ఉన్నారు.
శనివారం మధ్యాహ్నం 2.38 గంటలకు టేకాఫ్ అయిన ఈ విమానం.. 4 నిమిషాల్లోనే 10వేల 900 అడుగుల ఎత్తుకు చేరుకుంది. అనంతరం ఉన్నట్టుండి కిందకు పడిపోవడం మొదలై.. 21 సెకన్ల తర్వాత గ్రౌండ్ కంట్రోల్తో సంబంధాలు తెగిపోయాయి. అయితే, ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.
సదరు విమానాన్ని నడుపుతున్న పైలట్లు 10ఏళ్లకు పైగా అనుభవమున్నవారని అధికారులు తెలిపారు. బ్లాక్ బాక్సులను వెలికితీసి, పరిశీలన చేపట్టిన అనంతరం మరిన్ని వివరాలు లభ్యమవుతాయని సైనికాధికారి తెలిపారు. కాగా, ఇప్పటికే ఇండోనేషియాలో పలు విమాన ప్రమాదాలు జరిగాయి. ఇండోనేషియా దీవుల మధ్య ఎక్కువగా విమానయానమే జరుగుతుంది. దీంతో ఎక్కువగా ఇక్కడి ప్రజలు విమానాల్లోనే ప్రయాణిస్తుండటంతో.. సాంకేతిక లోపాల కారణంగా పలు ప్రమాదాలు జరుగుతున్నాయి.
1994లో యూఎస్ ఈ విమానాన్ని ఇండోనేషియాకు అందజేసింది. 2012లో శ్రీవిజయ ఎయిర్ ఫ్లైట్లోకి వచ్చిందీ విమానం. శ్రీవిజయ ఎయిర్ అనేది చిన్న విమానయాన సంస్థ. ప్రస్తుతం ఈ సంస్థ కేవలం 9 విమానాలను మాత్రమే నడుపుతోంది. ఇవన్నీ లేటెస్ట్ మాక్స్ వేరియంట్ వర్షెన్ కంటే ఇవన్నీ కూడా ఇంతకుముందు మోడల్ విమానాలు కావడం గమనార్హం.
2018 అక్టోబర్లో భారీ విమాన ప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. జావా సముద్రంలో ఈ విమానం కూలిపోవడంతో 189 మంది ప్రయాణికులు, విమాన సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు.