'ఇండోనేసియా విమాన ప్రమాదంలో ఎవరూ బతికిలేకపోవచ్చు': అతడిని కాపాడిన ట్రాఫిక్ జామ్
జకర్తా: ఇండోనేషియాలో 189 మంది ప్రయాణీకులు, సిబ్బందితో వెళ్తున్న లయన్ ఎయిర్ విమానం సముద్రంలో కూలిన విషయం తెలిసిందే. జకర్తా విమానాశ్రయం నుంచి బయలుదేరిన కాసేపటికే అది కూలిపోయింది. ఈ విమానంలో 181 మంది ప్రయాణీకులు, పైలట్లు, సిబ్బంది ఉన్నారు. ఈ విమానం సమత్ర దీవుల్లోని పంగ్కల్ పినాంగ్కు బయలుదేరింది. టేకాప్ అయిన 13 నిమిషాలకు కూలింది.
చదవండి: సముద్రంలో కుప్పకూలిపోయిన విమానం: 188మంది ప్రయాణికులు..
ఈ విమాన ప్రమాదంలో ఎవరూ బతికి ఉండరని అధికారులు వెల్లడించారు. విమానం కోసం 300 మంది గాలింపు చర్యల్లో పాల్గొన్నారు. పోలీసులు, సైనికులు, మత్స్యకారులు గాలిస్తున్నారు. తాము విమాన శకలాన్ని గుర్తించాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. అక్కడ ఉన్న బాడీ పార్ట్స్ను బట్టి ఎవరూ బతికి ఉండరని తెలుస్తోందని తెలిపారు.
విమానంలోని వారు ఎవరూ బతికి ఉండకపోవచ్చు
ఈ లయన్ విమానం సముద్రంలో కూలడంతో ఎవరూ బతికి ఉండరని భావిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. కాగా, ఈ విమానంలో ప్రయాణించాల్సిన ఓ వ్యక్తి చివరి నిమిషంలో అది అందక పోవడంతో ప్రాణాలు దక్కించుకున్నారు. అతని పేరు సోనీ సెటియావాన్. ఇతను ఇండోనేసియా ఫైనాన్స్ మినిస్ట్రీ అధికారి.
ట్రాఫిక్ జామ్ కారణంగా అతను ప్రాణాలు దక్కించుకున్నాడు
జకర్తాలో దారుణమైన ట్రాఫిక్ జామ్ కారణంగా తాను ఈ విమానాన్ని అందుకోలేకపోయినట్లు సోని సెటియావాన్ వెల్లడించారు. విమానాశ్రయానికి ఆలస్యంగా రావడంతో సరైన సమయానికి అందుకోలేకపోయినట్లు చెప్పారు. దీంతో అతను విమాన ప్రమాదం నుంచి అదృష్టవశాత్తూ బయటపడ్డారు.
సహోద్యోగులు చనిపోయారని కన్నీరుమున్నీరు
తాను, తన సహోద్యోగులు ఎక్కువగా ఈ విమానాన్నే ఎక్కుతుంటామని, తామంతా వేరే పని మీద వెళ్లేందుకు బయలుదేరామని, ఎప్పుడూ ఉదయం మూడు గంటలకు జకార్తా చేరుకునేవాడినని, కానీ ఈసారి మాత్రం ట్రాఫిక్ జామ్లో చిక్కుకొని విమానాశ్రయానికి ఆలస్యంగా వెళ్లానని, దీంతో విమానాన్ని అందుకోలేకపోయానని, కానీ కొద్ది గంటలకే ఆ విమానం కుప్పకూలిపోయిందనే వార్త వినాల్సి వచ్చిందని కన్నీరుమున్నీరు అయ్యారు.
ఆ విమానంలోనే ఉన్నారని కుటుంబం కంగారు
తొలుత ఈ వార్త వినగానే బాగా ఏడ్చేశానని, విమానంలో ప్రయాణించిన వారిలో తన సహోద్యోగులు ఆరుగురు ఉన్నారని కంటతడి పెట్టారు. తాను ఆ విమానంలోనే ఉన్నానని తన కుటుంబసభ్యులు అనుకున్నారని, ప్రమాద వార్త వినగానే తన తల్లి బోరున విలపించిందని, ఆ తర్వాత వాళ్లకి ఫోన్ చేసి తాను క్షేమంగానే ఉన్నట్లు చెప్పానని సోనీ తెలిపారు. కాగా కూలిన విమానంలో ఇండోనేషియా ఆర్థికమంత్రిత్వ శాఖకు చెందిన 20 మంది అధికారులు ఉన్నారు.