బద్ధలైన మౌంట్ మెరాపీ: తప్పిన పెను ప్రమాదం..విమానాలకు హైఅలర్ట్
యోగ్యకర్తా/ఇండోనేషియా: ఇండోనేషియాలో మరో అగ్నిపర్వతం బద్ధలైంది. మౌంట్ మెరాపీ అగ్నిపర్వతం మంగళవారం రోజును నిప్పులు కక్కింది. దీంతో గాల్లోకి పెద్ద ఎత్తున బూడిద ఎగిసిపడుతోంది. దాదాపు 6 కిలోమీటర్ల ఎత్తు వరకు అగ్నిపర్వతం నుంచి బయటకు వస్తున్న బూడిద కమ్మేసినట్లు ఇండోనేషియా అధికారులు చెప్పారు. యోగ్యకర్త నగరం నుంచి దాదాపు 30 కిలోమీటర్ల దూరంలో ఈ యాక్టివ్ వాల్కనో ఉంది. ఇది జావా ద్వీపంలో ఉంది.
విస్ఫోటనం చెందిన అగ్నిపర్వతం.. విమానాలకు హైఅలర్ట్
ఇక అగ్నిపర్వతం నుంచి బూడిద ఎగిసిపడుతుండటంతో విమానాశ్రయ అధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించారు. చుట్టుపక్కల పరిసరాలు బూడిదతో నిండిపోయినందున పైలట్లకు అలర్ట్ జారీ చేసింది ఇండోనేషియా విపత్తు సంస్థ. ఇక అగ్నిపర్వతం ఉన్న చోటు నుంచి 10 కిలోమీటర్ల పరిసరాల వరకు బూడిద చేరిందని అధికారులు వెల్లడించారు. స్థానిక కాలమాన ప్రకారం మంగళవారం ఉదయం 5గంటల 22 నిమిషాలకు అగ్నిపర్వతం బద్ధలుకాగా ఈ ప్రక్రియ 8 నిమిషాల పాటు జరిగిందని అధికారులు వెల్లడించారు.
ఐదు నిమిషాల పాటు వినిపించిన పేలుడు శబ్దం
ఇక అగ్నిపర్వతం బద్ధలైన సమయంలో పెద్ద పేలుడు శబ్దం దాదాపు ఐదు నిమిషాల పాటు వినిపించిందని స్థానికులు చెప్పారు. తమ ఇళ్ల మీదుగా బూడిద ఎగిసిపడిందని చెప్పారు. ప్రస్తుతం అధికారులు సురకర్తా నగరంలోని విమానాశ్రయంను తాత్కాలికంగా మూసివేశారు. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణాపాయం జరిగినట్లు సమాచారం లేదు. అగ్నిపర్వతం బద్ధలు అయ్యిందన్న విషయం తెలిసినప్పటికీ స్థానికులు మాత్రం దూరంగా ఉండకుండా తమ రోజూవారీ పనులలో నిమగ్నమయ్యారని అధికారులు వెల్లడించారు.
ఫిబ్రవరి 13న చివరిసారిగా విస్ఫోటనం
ఫిబ్రవరి 13న మౌంట్ మెరాపీ చివరిసారిగా విస్ఫోటనం చెందిందని అధికారులు చెప్పారు. అప్పటి నుంచి అలర్ట్గానే ఉన్నట్లు వారు వెల్లడించారు. ఇక అగ్నిపర్వతం బద్ధలయ్యాక ఎక్కువగా వాయువులే విడుదలైనట్లు అధికారులు చెప్పారు. మాగ్మా నుంచి ఈ తరహా విస్ఫోటనాలు సంభవిస్తూ ఉంటాయని అధికారులు తెలిపారు. ఇక మౌంట్ మెరపీ ఉన్న ప్రాంతం నుంచి మూడు కిలోమీటర్ల దూరంకు వెళ్లాలని స్థానికులకు అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అగ్నిపర్వతం నుంచి పొంగుతున్న లావా వల్ల ప్రాణహానీ ఉందని వెల్లడించింది.
Recommended Video
మౌంట్ మెరాపీ చరిత్ర
2010లో ఈ అగ్నిపర్వతం బద్ధలైనప్పుడు దాదాపు 300 మంది మృతి చెందారు. 2,80000 వేల మందిని స్థానికులను ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 1930 లో ఈ అగ్నిపర్వతం బద్ధలుకాగా ఆ సందర్భంలో 1300 మంది మృతి చెందారు. 1994లో జరిగిన విస్ఫోటనంకు 60 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆగ్నేసియా దేశంలో 17వేలకు పైగా ద్వీపాల సమూహాలు ఉండగా.. ఇందులో 130కి పైగా క్రియాశీల అగ్నిపర్వతాలు ఉన్నాయి. పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ ప్రాంతంలో ఈ అగ్నిపర్వతాలు ఉన్నాయి. ఇక్కడ భౌగోళిక అస్థిరత్వత ఎక్కువగా ఉంటుంది. టెక్టానిక్స్ ప్లేట్లు ఢీకొనడంతో ఈ ప్రాంతంలో ఎక్కువగా భూకంపాలు, అగ్నిపర్వతాల విస్ఫోటనాలు జరుగుతుంటాయి.