భూకంపం, సునామీ బీభత్సం: 384మంది మృతి, వందలాది మందికి గాయాలు
జకార్తా: ఇండోనేషియాలోని సులవెసి ద్వీపంలో చోటుచేసుకున్న భారీ భూకంపం సునామీకి దారితీసింది. పలు నగర తీరంపై సునామీ భారీ అలలతో విరుచుకుపడింది.
ఇండోనేషియా తీరం తాకిన సునామీ: బీభత్సం సృష్టిస్తున్న భారీ అలలు, నివాసాలు ధ్వంసం(వీడియో)
384మంది మృతి.. వందలాది మందికి గాయాలు
ఈ ఘటనలో సుమారు 384 మంది ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక ఆస్పత్రి వర్గాలు శనివారం వెల్లడించాయి. వందలాది మంది గాయాలతో చికిత్స పొందుతున్నారు. ఒక్క ఆస్పత్రిలోనే చికిత్స పొందుతూ 50 మందికిపైగా మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. మరో 100 మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉందని చెప్పారు. మృతుల సంఖ్య మరింత భారీగా ఉండొచ్చని అధికారులు ఆందోళన చెందుతున్నారు.
మరోసారి భూకంపం.. భారీగా ఎగిసిపడుతున్న అలలు..
శుక్రవారం సులవెసి ద్వీపంలో సంభవించిన భూకంపం తీవ్రత రిక్టరు స్కేలుపై 7.5గా నమోదైనట్లు అమెరికా జియోలాజికల్ సర్వే వెల్లడించింది. శనివారం ఉదయం కూడా పలు నగరంలో సునామీ కారణంగా అలలు పది అడుగుల ఎత్తుకు ఎగసిపడ్డాయి.
భూకంపం, సునామీల కారణంగా దయనీయంగా పరిస్థితి
తీరప్రాంత నగరమైన పలులో 3,50,000 మంది జనాభా ఉన్నారు. భూకంపం, సునామీల కారణంగా నగరంలో పరిస్థితి అత్యంత దారుణంగా మారింది. భూప్రకంపనల ధాటికి వందలాది భవనాలు కూలిపోయాయి. అనేకమంది భవనాల కింద చిక్కుకున్నట్లు తెలుస్తోంది. శనివారం ఉదయం సముద్ర తీరంలో కొన్ని మృతదేహాలు లభ్యమయ్యాయి. భవనాలు కుప్పకూలిన ప్రాంతాల్లో కూడా శిథిలాల కింద కొన్ని మృతదేహాలు కనిపించాయి. సహాయక సిబ్బంది రంగంలోకి దిగి సహాయ చర్యలు ముమ్మరం చేశారు.
భయానకంగా సునామీ దృశ్యాలు
భూకంపం, సునామీలు విరుచుకుపడటంతో వందలాది మంది మృతి చెందగా, చాలా మంది గాయాలపాలైనట్లు అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు చర్యలు చేపట్టింది. సునామీ ధాటికి తీర ప్రాంతంలోని ఇళ్లు, కట్టడాలు కొట్టుకుపోతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ప్రజలంతా భయాందోళనతో సురక్షిత ప్రాంతాలకు తరలివెళుతున్నారు.