ఇండోనేసియాలో భూకంపంతో 25సెం.మీ. పైకి వచ్చిన ద్వీపం, 387కు పెరిగిన మృతులు
బాలి: ఇండోనేసియాలో ఇటీవల భారీ భూకంపం కారణంగా 387 మంది వరకు మృతి చెందారు. ఈ భూకంపం భారీ నష్టాన్ని తెచ్చిపెట్టింది. అంతేకాదు, ఓ ఆశ్చర్యకర సంఘటన కూడా చోటు చేసుకుంది. ఈ భూకంపం తర్వాత లంబోక్ ద్వీపం 25 సెంటీమీటర్లు పైకి లేచింది.
ఈ భూకంపం ప్రభావంతో లంబోక్ ద్వీపంలో భౌగోళిక మార్పులు సంభవించినట్లు నాసా, కాలిఫోర్నియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సైంటిస్టులు తెలిపారు. భూకంప తాకిడితో లంబోక్ ద్వీపం వాయవ్య ప్రాంతం 25 సె.మీ. పైకి వచ్చిందని పేర్కొన్నారు.
మరికొన్ని చోట్ల భూకంప తీవ్రతకు భూమి 2 నుంచి 6 అంగుళాల కిందకు కుంగిపోయిందన్నారు. భూకంప కేంద్రానికి సమీపంలో ద్వీపం ఎత్తు 25 సె.మీ. అంటే పది అంగులాలు పైకి వచ్చినట్లు తెలిపారు.
ఇండోనేసియాలో భూకంపంతో 68,000 ఇళ్లు ధ్వంసం కాగా, 3.5 లక్షల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. అధికారుల సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. ఇటీవల రిక్టర్ స్కేలు పైన 7తో భారీ భూకంపం సంభవించింది. ఈ ఘటనలో 387 మంది చనిపోయారని, 13వేల మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు.