చిక్కుల్లో స్టీల్ ఐకాన్ లక్ష్మీ మిట్టల్...సోదరుడి అరెస్టుతో ఏం జరగబోతోంది..?
బోస్నియా: ప్రముఖ పారిశ్రామికవేత్త స్టీల్ కింగ్ లక్ష్మీ మిట్టల్ సోదరుడు ప్రమోద్ మిట్టల్ చిక్కుల్లో పడ్డాడు. అధికార దుర్వినియోగం, ఇతర మోసాలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై ఆయన్ను బోస్నియా పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. లుకావాక్ పట్టణంలోని ఈశాన్య ప్రాంతంలో ఓ కుక్కింగ్ ప్లాంట్ను ప్రమోద్ మిట్టల్ నడుపుతున్నారు. దీన్ని 2003 నుంచి ఆయన నడుపుతుండగా ఇందులో 1000మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. కోర్టు ఆదేశాలను అనుసరించిన పోలీసులు ప్రమోద్ మిట్టల్ను అదుపులోకి తీసుకున్నారు. ప్రమోద్ మిట్టల్ జీఐకేఐఎల్ అధ్యక్షుడిగా కూడా వ్యవహరిస్తున్నారు.
జీఐకేఐఎల్ సంస్థను 2003లో స్థాపించారు. గ్లోబల్ స్టీల్ హోల్డింగ్స్ సంస్థ యజమాని అయిన ప్రమోద్ మిట్టల్, మరో స్థానిక సంస్థ కేహెచ్కేలు జీఐకేఐఎల్ సంస్థకు సహనిర్వాహకులుగా ఉన్నారు. ఇక సంస్థకు చెందిన మరో ఇద్దరు ఉన్నతాధికారులు పరమేష్ భట్టాచార్య మరొకరు సూపర్వైజరీ బోర్డు సభ్యుడిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రమోద్ మిట్టల్పై వచ్చిన ఆరోపణలు రుజువైతే ఆయనకు 45 ఏళ్ల పాటు జైలు శిక్ష పడే అవకాశం ఉందని లాయర్లు చెబుతున్నారు. వీరందిరితో పాటు మరొక వ్యక్తికి అరెస్టు వారెంటు జారీ చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఇదిలా ఉంటే ప్రమోద్ మిట్టల్తో పాటు మిగతావారిని బుధవారం కోర్టులో హాజరుపర్చనున్నారు పోలీసులు. ఆర్గనైజ్డ్ క్రైమ్స్ను కవర్ చేసే ఓ ప్రముఖ వెబ్సైట్ ప్రకారం ప్రమోద్ మిట్టల్తో పాటు ఇతరులు దాదాపు 2.5 మిలియన్ యూరోల మేరా నిధులు దారి మళ్లించినట్లు తన కథనంలో ప్రచురించింది. ఇదిలా ఉంటే భారత్లో ప్రమోద్ నిర్వహించే వ్యాపారాల్లో తీవ్ర నష్టం వచ్చిన సమయంలో సోదరుడు లక్ష్మీ మిట్టల్ తన అప్పులను తీర్చి గట్టెక్కించారు. అంతలోనే మరో స్కామ్ ప్రమోద్ మెడకు చుట్టుకుంది. బల్కాన్స్లో ప్రమోద్ మిట్టల్కు చాలా కంపెనీలు ఉన్నాయి.