బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ కేబినెట్లో ఇన్ఫోసిస్ నారాయణమూర్తి అల్లుడు
బ్రిటన్ కొత్త ప్రధానిగా బోరిస్ జాన్సన్ ఎన్నికైన సంగతి తెలిసిందే. ఇప్పటికే భారత సంతతి వ్యక్తి ప్రీతి పటేల్కు తన కేబినెట్లో హోమ్ సెక్రటరీ పదవి ఇచ్చారు. తాజాగా జూనియర్ మంత్రిగా ఉన్న మరో భారత సంతతి వ్యక్తి అలోక్ శర్మను తన కేబినెట్లో చోటు కల్పించారు. అంతర్జాతీయ వ్యవహారాల శాఖ మంత్రిగా అలోక్ శర్మను బోరిస్ జాన్సన్ తన కేబినెట్లోకి తీసుకున్నారు. ఇక బోరిస్ జాన్సన్ ప్రధానిగా నియమితులైన తర్వాత తన సొంత టీమ్ను ఏర్పాటు చేసేదానిపై దృష్టి సారించారు. ఇందులో భాగంగానే రిషి సునాక్కు ట్రెజరీ చీఫ్ సెక్రటరీగా నియమించారు. చాన్సెలర్ సాజిద్ జావిద్ కింద రిషి పనిచేయనున్నారు.
నారాయణమూర్తి అల్లుడు రిషి సునాక్
రిషి సునాక్ ప్రముఖ సాఫ్ట్వేర్ దిగ్గజ కంపెనీ ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు అయిన నారాయణమూర్తికి స్వయంగా అల్లుడు అవుతారు.హ్యాంప్షైర్లో పుట్టిన రిషి సునక్ వయస్సు 39 ఏళ్లు. ఆయన యార్క్షైర్లోని రిచ్మండ్ నుంచి ఎంపీగా 2015లో గెలుపొందారు. స్థానిక ప్రభుత్వంలో ఆయన జూనియర్ మంత్రిగా పనిచేశారు. ఇప్పుడు చీఫ్ సెక్రటరీగా ప్రమోషన్ రావడంతో కేబినెట్ మీటింగ్లకు రిషి హాజరుకానున్నారు.
అంతర్జాతీయ అభివృద్ధిశాఖ మంత్రిగా అలోక్ శర్మ
బోరిస్ జాన్సన్ కేబినెట్లో మరో మంత్రిగా ఉన్న అలోక్ శర్మ ఆగ్రాలో జన్మించారు. 2010 నుంచి రీడింగ్ వెస్ట్ ఎంపీగా ఉన్నారు. థెరిసా మే ప్రభుత్వంలో ఆయన ఉపాధి శాఖ మంత్రిగా పనిచేశారు. ఈ మధ్య ప్రధాని అభ్యర్థి కోసం కన్జర్వేటివ్ పార్టీలో జరిగిన ఎన్నికల్లో బోరిస్ జాన్సన్కు మద్దతు పలికిన వారిలో అలోక్శర్మ ప్రథమ వ్యక్తిగా నిలిచారు. మే ప్రభుత్వంలో బోరిస్ జాన్సన్ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా ఉన్న సమయంలో శర్మ, విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రిగా సేవలందించారు. భారత్కు సంబంధించిన అంశాలు ఏమైనా ఉంటే బ్రిటన్ పార్లమెంటులో శర్మ సమాధానం ఇచ్చేవారు.
హోమ్ సెక్రటరీగా ప్రీతి పటేల్
బోరిస్ జాన్సన్ తన కేబినెట్లో ప్రీతి పటేల్, అలోక్ శర్మ, రిషి సునాక్లకు చోటు కల్పించడం ద్వారా బ్రిటన్లో ఉన్న 1.5 మిలియన్ భారతీయ కమ్యూనిటీకి న్యాయం చేశారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక హోం సెక్రటరీగా బాధ్యతలు తీసుకున్న ప్రీతి పటేల్కు పలు సవాళ్లు తన ముందున్నాయి. బ్రెగ్జిట్ రెఫరెండం సందర్భంగా జరిగిన ప్రచారంలో భారతీయ చెఫ్లకు వీసా నిబంధనలను సరళీకృతం చేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆ హామీని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది. యూకేలోని భారత రెస్టారెంట్ల పరిశ్రమలు చెఫ్లు లేక ఇబ్బందుల్లో ఉన్నాయి. వాటి నిర్వహణ కష్టసాధ్యమైంది. ప్రీతి పటేల్ను ఇండియన్ కమ్యూనిటీ ఛాంపియన్గా మాజీ ప్రధాని కేమరూన్ అభివర్ణించారు. 1.5 మిలియన్ ఇండియన్ కమ్యూనిటీకి బ్రిటన్ ప్రభుత్వానికి వారధిగా ప్రీతి పటేల్ నిలిచారని కొనియాడారు.
థెరిసా మే ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన ప్రీతి
జూలై 2016లో మాజీ ప్రధాని థెరిసా మే ప్రీతి పటేల్ను అంతర్జాతీయ వ్యవహారాల శాఖ మంత్రిగా నియమించారు. అయితే వ్యక్తిగత పర్యటనకు ఇజ్రాయిల్ వెళ్లిన ప్రీతి పటేల్ అనధికారిక చర్చలు ఆ ప్రభుత్వంతో జరిపిందన్న ఆరోపణలపై ఆమెను 2017 నవంబర్లో కేబినెట్ నుంచి తొలగించారు. ప్రస్తుతం ఉన్న బోరిస్ జాన్సన్ ప్రభుత్వంలో కన్జర్వేటివ్ ప్రభుత్వంగా కనిపిస్తోంది. థెరిసా మే కేబినెట్లో పనిచేసిన చాలామందికి ఆయన ఉద్వాసన పలికారు. ఇక యూరోపియన్ యూనియన్ నుంచి మరో 99 రోజుల్లో బ్రిటన్ బయటకు వస్తున్న నేపథ్యంలో జాన్సన్ తన కేబినెట్లో దాదాపు కొత్త ముఖాలకు చోటు కల్పించడం విశేషం.