పెషావర్ ఆర్మీ స్కూల్లో గుండె పగిలే దృశ్యాలు
పెషావర్: తాలిబన్ ఉగ్రవాదులు దాడి చేసిన పాకిస్తాన్ పెషావర్లోని ఆర్మీ పాఠశాల లోనికి వెళ్తే విషాదం ముప్పిరిగొనే పరిస్థితి ఉంది. గుండె తరుక్కుపోయే విధంగా పాఠశాల ఆవరణ ఉంది. అన్నెం పున్నెం ఎరుగని పిల్లల గుర్తులు దయనీయంగా కనిపించాయి. రక్తంతో తడిసిన బూట్లు, యూనిఫారాల ముక్కలు, చిందరవందరగా పడి ఉన్న జామెట్రీ బాక్సులు కనిపించాయి. రక్తం మడుగులు అంతటా పరుచుకుని ఉన్నాయి.
తొమ్మిది మంది సాయుధులు మంగళవారంనాడు పాఠశాలపై దాదడి చేశారు. పాకిస్తాన్ ఎదుర్కున్న అతి పెద్ద, అతిదారుణమైన ఉగ్రవాద దాడి ఇది. ఈ దాడిలో 132 మంది ముక్కుపచ్చలారని చిన్నారులు హతమయ్యారు. మొత్తం 148 మంది ఉగ్రవాదుల దాడిలో మరణించారు. పాఠశాలలోకి మీడియాను బుధవారంనాడు అనుమతించారు.
ముగ్గురు సాయుధులు తొలుత పాఠశాల ఆడిటోరియంలోకి ప్రవేశించారు. పాఠశాలలోని మూడు బ్లాకుల్లో అది ఒక్కటి. ఆడిటోరియంలోనే ఉగ్రవాదులు వంద మంది పిల్లలను పొట్టన పెట్టుకున్నారు. ఫస్ట్ ఎయిడ్పై వర్క్షాప్ ఉండడంతో పెద్ద యెత్తున పిల్లలు అక్కడ గుమికూడారు. ఫస్ట్ ఎయిడ్ పరికరాలు వేదిక మీద గల బల్లపై పడి ఉన్నాయి. దాని పక్కన పెద్ద రక్తం మడుగులు ఉన్నాయి.
కొంత మంది పిల్లలు ఆడిటోరియానికి ఆనుకుని ఉన్న టాయిలెట్లో దాక్కోవడానికి ప్రయత్నించినట్లు అర్థమవుతోంది. అయితే, ఉగ్రవాదులు వారిని పట్టుకుని కాల్చి చంపారు. పారిపోవడానికి పరుగులు తీస్తుంటే ఉగ్రవాదులు కాల్పులు జరిపి వారిని మట్టుబెట్టిన వైనం అక్కడి పరిస్థితి తెలియజేస్తోంది. మంటలు లేచిన గుర్తులు, గ్రెనేడ్ పేలుళ్ల ఆనవాళ్లు కూడా ఉన్నాయి. ఆ తర్వాత ఉగ్రవాదులు బ్లాక్ నుంచి బ్లాక్కు వెళ్తూ, తరగతి గది నుంచి తరగతికి తిరగుతూ విద్యార్థులను కాల్చి వేసినట్లు అర్థమవుతోంది.ఉగ్రవాదులు పిల్లలను పాయింట్ బ్లాంక్ రేంజ్లో కాల్చి వేశారు.
ఆవరణలో ఎక్కడపడితే అక్కడ రక్తం మడుగులు కనిపించాయి. చిరిగిన నోట్ బుక్కులు దర్శనమిచ్చాయి. పగిలిన కిటికీ అద్దాలు, డోర్ ఫ్రేమ్స్ కనిపించాయి. పగిలిన ఓ చిన్నారి కళ్లద్దాలు నేల మీద కనిపించాయి. ఉగ్రవాదుల చర్యపై ప్రపంచ వ్యాప్తంగా నిరసన, అగ్రహం వ్యక్తమవుతున్నాయి. పాకిస్తాన్ విషాద సముద్రంలో మునిగిపోయింది.