‘పిల్లలకు నూడిల్స్ తినిపించడం వల్లే ‘గే’లవుతున్నారు’
జకార్తా: ఇన్స్టాంట్ నూడిల్స్, కండెన్స్డ్ మిల్క్ లాంటి ఆహార పదార్థాలు పిల్లలను ‘గే'లుగా మార్చేస్తున్నాయని ఇండోనేషియాలోని టాంజెరాంగ్ సిటీ మేయర్ ఆరీఫ్ ఆర్ విస్మాన్ స్యాహ్ వ్యాఖ్యానించారు. ఈ వారంలో సిటీలో జరిగిన ‘ప్రెగ్నెన్సీ సెమినార్'లో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇండోనేషియాలో స్వలింగ సంపర్కులు తమ హక్కుల కోసం పోరాటం చేస్తున్న సమయంలో మేయర్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇండోనేషియా పిల్లలను ఆరోగ్యమై, తెలివైనవారిగా తీర్చిదిద్దేందుకు చేయాల్సిన మొదటి పని వారికి తల్లిపాలను అందేలా చూడాలని అన్నారు. ఆ తర్వాత సంతులిత ఆహారాన్ని అందించాలని చెప్పారు.
కానీ, ఈ రోజుల్లో తల్లిదండ్రులిద్దరూ ఉద్యోగాలు చేస్తూ బిజీగా ఉండటం వల్ల పిల్లలకు ఇన్ స్టాంట్ నూడిల్స్, కేన్డ్ మిల్స్ వంటివి ఇచ్చేస్తున్నారని చెప్పారు. ఇలాంటి ఆహార పదార్థాలు పిల్లలను స్వలింగ సంపర్కులుగా మార్చేస్తున్నాయని తెలిపారు. అందుకే ఈ మధ్య కాలంలో స్వలింగ సంపర్కులు ఎక్కువవుతున్నారని చెప్పడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదని స్పష్టం చేశారు.
కాగా, నిరుడు స్వలింగ సంపర్కులు తమ స్వేచ్ఛ కోసం ఇండోనేషియాలో ఉద్యమం లేవనెత్తారని.. న్యూక్లియర్ వార్ ఎంతటి ప్రమాదకరమో ఈ ఉద్యమం కూడా అంతే ప్రమాదకరమని ఇటీవలో ఓ రాజకీయ నాయకుడు అన్నారు.
స్వలింగ సంపర్కులను యూనివర్సిటీల నుంచి నిషేధించాలని పిలుపునిచ్చిన ఓ మంత్రి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. స్వలింగ సంపర్కుల ఉద్యమం నిజంగా ఓ బెదిరింపు లాంటిదేనని ఇండోనేషియా రక్షణశాఖ మంత్రి ర్యామిజార్డ్ వ్యాఖ్యానించారు.