Solstice theme Yoga: న్యూయార్క్ టైమ్స్స్క్వేర్ వద్ద..రోజంతా: యోగా కోసం స్పెషల్ యాప్
వాషింగ్టన్: ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు ఏడవ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకొంటోన్నాయి. అగ్రరాజ్యం అమెరికా, భారత్, బ్రిటన్, ఫ్రాన్స్ వంటి పలు దేశాలు యోగా దినోత్సవాన్ని పాటిస్తోన్నాయి. బహిరంగ ప్రదేశాలు, పార్కుల్లో యోగాసనాలను వేస్తోన్నారు అక్కడి ప్రజలు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో యోగాకు ప్రాధాన్యత మరింత పెరిగిందనేది స్పష్టమౌతోంది. యోగా ప్రాధాన్యతను వివరిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కొద్దిసేపటి కిందటే దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. భారత్ సహకారంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎం-యోగా యాప్ (M-Yoga app)ను రూపొందించిందని పేర్కొన్నారు.
యోగా దినోత్సవాన్ని అమెరికన్లు ఉత్సాహంగా జరుపుకొంటోన్నారు. న్యూయార్క్లోని ప్రతిష్ఠాత్మక టైమ్స్ స్క్వేర్ వద్ద యోగా డే సెలబ్రేషన్స్ను ఏర్పాటు చేశారు. రోజంతా ఈ కార్యక్రమం కొనసాగుతోంది. సోల్స్టైస్ థీమ్ (Solstice theme Yoga)తో ఈ కార్యక్రమాన్ని జరుపుకొంటోన్నారు. ఏడాదిలో సుదీర్ఘమైన రోజు కూడా కలిసి రావడంతో దీనికి సోల్స్టైస్ థీమ్గా పేరు పెట్టారు. అమెరికాలోని భారత కాన్సులేట్ జనరల్ దీన్ని నిర్వహిస్తోంది. మూడువేల మందికి పైగా అమెరికన్లు ఇందులో పాల్గొన్నారు.
వరుసగా ఏడు సంవత్సరాలుగా అమెరికాలో యోగా దినోత్సవ కార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తోన్నట్లు భారత కాన్సులేట్ అధికారులు పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం యోగాసనాల్లో పాల్గొనే వారి సంఖ్య రెట్టింపు అవుతోందని అన్నారు. ఏటేటా యోగా దినోత్సవానికి డిమాండ్ పెరుగుతోందని, ఇది ఆహ్వానించదగ్గ పరిణామమని చెప్పారు. ఒక్క టైమ్స్ స్క్వేర్ వద్ద నిర్వహిస్తోన్న కార్యక్రమానికే మూడు వేల మందికి పైగా హాజరయ్యారని, దీన్ని బట్టి చూస్తే అమెరికాలో దీనికి ఉన్న ప్రాధాన్యత ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చని అన్నారు. ప్రధాన నగరాల్లో ఇలాంటి సెలబ్రేషన్లను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
US | Consulate General of India, New York partnered with the Times Square Alliance to host the International Yoga celebrations in Times Square on Sunday. Over 3,000 people attended the day-long event which was themed 'Solstice'. pic.twitter.com/olwvhQRco0
— ANI (@ANI) June 20, 2021