ఇంటర్నెట్ అదృశ్యమౌతుంది: గూగుల్ బాస్, జాబ్స్పై 'ఫేస్బుక్' షెరిల్
దావోస్: భవిష్యత్తులో ఇంటర్నెట్ అదృశ్యం కానుందని గూగుల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎరిక్ స్మిడ్త్ అన్నారు. దావోస్లో ప్రపంచ ఎకనామిక్ ఫోరమ్ జరుగుతోన్న విషయం తెలిసిందే. ఇందులో ఎరిక్ స్మిడ్త్ మాట్లాడారు. ఇప్పటికే ఎన్నో ఐపీ అడ్రస్లు, ఇతర పరికరాలు, సెన్సర్లను మనం వినియోగిస్తున్నామన్నారు.
మనకు తెలియకుండానే ప్రైవసీ సమాచారం మొత్తం నిఘా ద్వారా ఇతరులకు చేరిపోతోందన్నారు. దీంతో భవిష్యత్తులో ఇంటర్నెట్ వాడాలంటేనే భయం ఏర్పడే పరిస్థితి వస్తుందని అభిప్రాయపడ్డారు.
ఫేస్బుక్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ షెరిల్ షాండ్బెర్గ్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగాల విషయంలో ఆందోళన చెందుతున్నారన్నారు. ప్రపంచంలో టెక్నాలజీ దూసుకు పోతోంది. దీనిపై ఆమె మాట్లాడుతూ.. ప్రతి విషయంలో గతంలో కంటే ఎంతో వేగంగా పరివర్తన కనిపిస్తోందన్నారు.
ఎరిక్ స్మిడ్త్ మాట్లాడుతూ.. టెక్నాలజీ ఎన్నో ఉద్యోగాలను కల్పిస్తోందన్నారు. కేవలం టెక్నాలజీలోనే కాకుండా.. వీటి ఆధారంగా బయట కూడా అంటే పరోక్ష ఉద్యోగాలు కూడా వస్తున్నాయన్నారు. ప్రతి ఒక టెక్ ఉద్యోగం కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా వివిధ రూపాల్లో ఐదు నుండి ఏడుగురికి ఉపాధి కల్పిస్తోందన్నారు.
యూరోప్లో సింగిల్ డిజిటల్ మార్కెట్ ఉన్నట్లయితే, నాలుగు వందల మిలియన్ల కొత్త, ముఖ్యమైన కొత్త ఉద్యోగాలు యూరోప్లో ఉంటాయన్నారు. టెక్నాలజీ ఉద్యోగాలను మింగేస్తోందా అనే అంశంపై గూగుల్ బాస్ ఎరిక్ స్మిడ్త్ స్పందిస్తూ.. వ్యవసాయంలో కొన్ని ఉద్యోగాలు పోయినప్పుడు ట్రాక్టర్ వచ్చిందని, దాని ద్వారా కొంతమందికి ఉపాధి ఉందని అభిప్రాయపడ్డారు.