సరే ఆపేస్తాం: ఎట్టకేలకు భారత్ దెబ్బకు దిగొచ్చిన చైనా
న్యూఢిల్లీ/బీజింగ్: లైన్ ఆప్ యాక్యువల్ కంట్రోల్ (ఎల్ఏసి) వద్ద రోడ్డు నిర్మాణం ఆపేస్తామని చైనా ప్రకటించింది. రోడ్డు నిర్మాణం పనులు ఆపేస్తామని చైనా ప్రకటించడంతో స్వాధీనం చేసుకున్న ఎక్విప్మెంట్స్ ఇస్తామని భారత్ ప్రకటించంది.
అరుణాచల్ ప్రదేశ్లోని ఉప్పర్ సియాంగ్ జిల్లా పరిధిలోని బీసింగ్ ప్రాంతంలో చైనా రోడ్డు నిర్మాణం తలపెట్టిన విషయం తెలిసిందే. దీనిని నిలిపివేస్తున్నట్లు తాజాగా ప్రకటన చేసింది. తొలుత ఈ ప్రాంతం తమదని, ఇక్కడ రోడ్డు వేసే హక్కు తమకుందని వాదించింది.
డొక్లాం వద్ద చైనా బలగాల సంఖ్య తగ్గింది, చాణక్య నీతిపై దృష్టి పెట్టాలి: ఆర్మీ చీఫ్ జనరల్
రెండు దేశాల చర్చలు
చైనా సైన్యం నిర్మాణాలు తలపెట్టడంతో యంత్ర సామాగ్రిని భారత్ సీజ్ చేసింది. ఆ తర్వాత ఆరో తేదీన రెండు దేశాల ఆర్మీ ఉన్నతాధికారులు సమావేశమై చర్చలు జరిపారు. అరుణాచల్ ప్రదేశ్ ప్రాంతంలో చైనా చొరబాటును ఇండియా ఏ మాత్రమూ సహించేది లేదని తేల్చి చెప్పారు.
భారత్ ఒత్తిడి, దిగొచ్చిన చైనా
భారత్ ఒత్తిడి నేపథ్యంలో చైనా దిగి వచ్చింది. చేసేది లేక రోడ్డు నిర్మాణాన్ని విరమించుకున్నట్టు పేర్కొంది. చైనా కార్మికులు భారత భూభాగంలోకి ప్రవేశించడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకించామని, చైనా దిగొచ్చిందని, దీంతో తాము సీజ్ చేసిన నిర్మాణ రంగ యంత్ర పరికరాలను చైనాకు తిరిగి ఇవ్వాలని నిర్ణయించామని ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ వెల్లడించారు.
కొంత రోడ్డు వేశాక కల్పించుకున్న భారత్
భారత్ - టిబెట్ సరిహద్దుకు అతి దగ్గరగా ఉన్న ఈ ప్రాంతంలో రోడ్డు వేసేందుకు గత ఏడాది డిసెంబర్ 26వ తేదీన చైనా సైన్యం పని మొదలు పెట్టింది. పన్నెండు అడుగుల వెడల్పుతో, దాదాపు 600 మీటర్ల దూరం రోడ్డు వేసిన తర్వాత భారత్ కల్పించుకుంది.
కార్మికులు అదుపులో
అందరినీ అదుపులోకి తీసుకొని, యంత్ర పరికరాలను కూడా సీజ్ చేసింది. తాము కేవలం రోడ్డు వేస్తున్న కార్మికులనే నిర్బంధించామని, చైనా సైన్యం పట్టుబడలేదని అధికారులు వెల్లడించారు.