అయ్యో.. ఆఫ్రికా: తెర పైకి 'బానిసల మార్కెట్లు', ప్రపంచం విస్తుపోయే కథనం వెలుగులోకి ..
లిబియా నుంచి మధ్యదరా సముద్రం మీదుగా దశాబ్ద కాలంగా వలసలు ఎక్కువవడంతో.. ఇక్కడ మాఫియా గ్యాంగులు పుట్టుకొచ్చాయి.
లిబియా: బతుకు దుర్భరమై వలసే ప్రత్యామ్నాయమైన చోట నిర్బంధాలు రాజ్యమేలుతున్నాయి. అంగట్లో వస్తువుల్లా మనుషులను తెగనమ్మే సంతలు పుట్టుకొచ్చాయి. మధ్య యుగాలను గుర్తుకు తెచ్చే ఆఫ్రికన్ బానిసల అమ్మకాలు మళ్లీ తెరమీదకు వచ్చాయి.
33వేల మంది జలసమాధి: ప్రపంచంలోనే అతి ప్రమాదకరమైన సరిహద్దు అది..
అంతర్జాతీయ మీడియా సంస్థ సీఎన్ఎన్ ఈ చీకటి వ్యవహారాలను ప్రపంచం ముందుపెట్టింది. లిబియాలో చిక్కుకుపోయి మాఫియా చేతిలో చిత్రహింసలకు గురవుతున్న ఆఫ్రికన్ల ఆవేదనను కళ్లకు కట్టింది. శరణార్థులను అక్కున చేర్చుకోని దేశాలు ఓవైపు.. ఉన్నచోట బతకలేని దుస్థితులు మరోవైపు.. దీంతో మధ్యలో మాఫియా చేతికి చిక్కి వారు విలవిల్లాడిపోతున్నారు.
లక్షలాది శరణార్థులు:
పశ్చిమాఫ్రికా, మధ్య ఆఫ్రికా దేశాల్లో అంతర్యుద్దం, సంక్షోభాలు, పేదరికం చాలామందిని వలసబాట పట్టిస్తున్నాయి. సిరియా, నైజీరియా,బంగ్లాదేశ్, టర్కీ వంటి దేశాల నుంచి యూరప్ దేశాలకు వలస వెళ్లేవారి సంఖ్య పెరుగుతోంది. ఆ క్రమంలో వీరు రోడ్డు మార్గాల ద్వారా అక్రమంగా లిబియా చేరుకుంటున్నారు. అక్కడి నుంచి మధ్యదరా సముద్రం మీదుగా యూరప్ చేరుకోవాలనే ఆశతో లిబియా వెళ్తున్నారు.
మాఫియా చేతుల్లో చిక్కి:
లిబియా నుంచి మధ్యదరా సముద్రం మీదుగా దశాబ్ద కాలంగా వలసలు ఎక్కువవడంతో.. ఇక్కడ మాఫియా గ్యాంగులు పుట్టుకొచ్చాయి. వలసొచ్చేవారిని మధ్యదరా సముద్రం దాటించే నెపంతో ఒప్పందాలు కుదుర్చుకుంటారు. అడిగినంత డబ్బు చెల్లించిన తర్వాత.. చిన్న చిన్న పడవల్లో పదులకొద్ది జనాలను కుక్కి పంపిస్తారు. తీరా అది అర్థాంతరంగా సముద్రంలోనే మునగడమో.. లేక యూరప్ చేరుకున్నా.. అక్కడి భద్రతా సిబ్బంది తిరిగి వెనక్కి పంపడమో జరుగుతుంది. అదృష్టం బాగుంటే మాత్రం యూరప్లో అడుగుపెడుతారు.
గోదాముల్లో నిర్బంధాలు:
యూరప్ దేశాల భద్రతా సిబ్బంది శరణార్థులను తిప్పి పంపించిన తర్వాత సదరు బోటు నిర్వాహకులు వారిని తీసుకొచ్చి లిబియాలోని గోదాముల్లో బంధిస్తున్నారు. అలా జువారా, సబ్రాత్, కాసిల్వెర్డే, గర్యాన్, అల్రుజ్బాన్, అల్జింటాన్, కబావ్, గడామిస్ లాంటి పట్టణాల్లో వందలాది ఆఫ్రికన్లు బంధీలుగా చిక్కుకుపోయారు.
బానిసల మార్కెట్లో వేలం:
వాళ్లు చెల్లించిన డబ్బు ప్రయాణానికి సరిపోలేదని, కాబట్టి మరింత డబ్బు చెల్లించేవరకు అక్కడినుంచి పంపించేది లేదని చెబుతారు. వారి తల్లిదండ్రులకు ఫోన్ చేసి అడిగినంత డబ్బు తీసుకురావాలంటారు. ఒకవేళ డబ్బు తీసుకురాకపోతే.. సంతలో పశువుల్లా ఎవరికైనా అమ్మేస్తారు. కాంట్రాక్టు ఒప్పందం మీద వ్యాపారస్తులకు వారిని విక్రయిస్తుంటారు. కాంట్రాక్టు ముగియగానే సదరు వ్యాపారి వారిని తీసుకొచ్చి మళ్లీ అక్కడ అప్పగిస్తాడు. ఇంకా బాకీ తీరలేదన్న కారణంతో ఆ మాఫియా గ్యాంగ్ వారిని మరొకరికి విక్రయిస్తుంది.
లిబియాలో దుర్భర పరిస్థితులు:
ఐక్యరాజ్య సమితి అంచనా ప్రకారం ప్రస్తుతం లిబియాలో దాదాపు 7లక్షల నుంచి 10లక్షల వరకు ఉన్నారు. లిబియా ప్రభుత్వ ఆధీనంలో ఉన్న శరణార్థుల కేంద్రాల్లో మరో 25వేల మంది దాకా ఉన్నారు. వారిని తిరిగి మాతృదేశాలకు పంపించే ప్రయత్నం చేస్తున్నా.. ఆ దేశాలు కూడా వారిని తిరస్కరిస్తున్నాయని లిబియా ప్రభుత్వం ఆరోపిస్తోంది. అయితే లిబియాలోని దుర్భర పరిస్థితుల కన్నా స్వదేశం వెళ్లడమే మంచిదని 8,800మంది శరణార్థులు ముందుకు వచ్చినట్టు ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ సంస్థ తెలిపింది.
చిత్రహింసలు:
ఆఫ్రికన్లను బానిసలుగా గోదాముల్లో బంధించి మాఫియా గ్యాంగులు వారిని చిత్రహింసలు పెడుతున్నాయి. ఇష్టం వచ్చినట్టు కొట్టడం, మర్మాంగాల్లో పదునైన వస్తువులను జొప్పించి విలవిల్లాడేలా చేయడం వంటి దారుణమైన చర్యలకు పాల్పడుతున్నాయి. సీఎన్ఎన్ వెలికితీసిన బానిసల వేలం కథనంతో లిబియా ప్రభుత్వం కదిలింది. దీనిపై విచారణ జరిపిస్తామని తెలిపింది.