ఇండోనేషియా విమాన ప్రమాదం అప్ డేట్:189 మంది జలసమాధి...ఇంకా అంతుచిక్కని కారణాలు
జకార్తా:మరో ఘోర విమాన ప్రమాదం...పెను విషాదానికి కారణమైంది. సముద్రంలో కూలిపోయిన ఇండోనేషియాకు చెందిన 'లయన్ ఎయిర్' విమానం ప్రమాదంలో సిబ్బందితో సహా విమానంలో ఉన్న మొత్తం 189 జల సమాధి అయిపోయారు.
సోకార్నో హట్టా సోమవారం ఉదయం గాల్లోకి లేచిన 13 నిమిషాల్లోనే ఈ విమానం జావా సముద్రంలో కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో విమానంలోని పైలెట్లు...కో పైలెట్లు సహా అందరూ మరణించినట్లే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రమాదం నుంచి ఎవరైనా సజీవంగా బయటపడ్డారేమోనని అధికారులు గాలింపు జరపగా...అలాంటి వారి జాడ ఎక్కడా కనిపించలేదు.
మొదట...ఏం జరిగిందంటే?
స్థానిక కాలమానం ప్రకారం జకార్తాలోని సోకార్నో హట్టా ఎయిర్ పోర్ట్ నుంచి విమానం సోమవారం ఉదయం 6.20కి బంగ్కా బెలిటుంగ్ దీవుల్లోని పంగ్కల్ పినాంగ్ నగరానికి బయలుదేరింది. ఈ విమానంలో ఒక శిశువు, ఇద్దరు చిన్నారులు, ఇద్దరు పైలట్లు, ఆరుగురు సిబ్బంది సహా మొత్తం 189 మంది ఉన్నారు. గంట ప్రయాణంతో 7.20 కి గమ్యస్థానానికి చేరుకోవాల్సిన ఈ విమానం బయలుదేరిన రెండు నిమిషాలకే ఇంజన్ లో తేడా వచ్చి 2వేల అడుగుల ఎత్తులో ఉండగా...ఆకస్మికంగా 500 అడుగుల మేర కిందకు దిగుతూ ఎడమవైపుకు జారిపోయింది. మళ్లీ పుంజుకొని 5వేల అడుగుల ఎత్తుకు చేరింది. అప్పటికి విమానం గాల్లోకి లేచి 13 నిమిషాలు.
'ఇండోనేసియా విమాన ప్రమాదంలో ఎవరూ బతికిలేకపోవచ్చు': అతడిని కాపాడిన ట్రాఫిక్ జామ్
కుప్పకూలిపోయింది...ఇలా
ఇంతలో విమానానికి ఎయిర్ కంట్రోల్ విభాగంతో రేడియో సంబంధాలు తెగిపోయాయి. రాడార్ తెర నుంచి ఎరోప్లెయిన్ అదృశ్యమైంది. విమానం గల్లంతయ్యే సమయానికి చివరిసారిగా 3650 అడుగుల ఎత్తులో కనిపించి ఆ తర్వాత కనిపించలేదు. ఆ సమయంలో ఇండోనేసియా తీరానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు డేటా సూచిస్తోంది. అయితే విమానం రేడియో సంబంధాలు తెగిపోవడానికి ముందు తమ విమానాన్ని తిరిగి జకార్తాలోని సోకర్నో-హట్టా ఎయిర్పోర్టుకు తీసుకువస్తామని పైలట్...ఏటీసీ అనుమతి కోరారని...అంతలోనే సంబంధాలు తెగిపోయాయని తెలుస్తోంది. ఆ తర్వాత క్షణాల్లోనే విమానం జావా సముద్రంలో కూలిపోగా...జకార్తా రేవునుంచి అప్పుడే బయలుదేరివెళుతున్న ఒక షిప్ లోని వారు ఈ ప్రమాదం ఘటనను ప్రత్యక్షంగా చూశారని తెలిసింది.
ఎట్టకేలకు...గుర్తించారు
ప్రమాదం గురించి తెలియగానే అధికారులు హుటాహుటిన సహాయక సిబ్బందిని జావా సముద్రంలో అన్వేషణకు పంపగా కొన్ని గంటల పాటు వారి జాడ కనపడలేదు. ఆ తరువాత సముద్రంలో కొన్ని మృతదేహాలు, చమురు తెట్టు, విమాన శకలాలు, చిన్నారుల బూట్లు, గుర్తింపు కార్డులు, సెల్ఫోన్ భాగాలు, లగేజీ వంటి ప్రయాణికుల సామాన్లు తేలియాడుతూ కనిపించాయి. అక్కడికి సమీపంలోని ఒక చమురు శుద్ధి కర్మాగారం వద్దకు కూడా శకలాలు కొట్టుకొచ్చాయి. ప్రమాదం జరిగి ఇప్పటికే కొన్ని గంటలు గడిచిపోవడంతో విమానంలోని అందరూ చనిపోయి ఉంటారని అధికారులు భావిస్తున్నారు. గాలింపు చర్యల్లో 40 మంది డైవర్లు సహా 150 మందితోపాటు నౌకలు, హెలికాప్టర్ పాలుపంచుకుంటున్నాయి.
పైలెట్ ఇండియన్...ఢిల్లీ వాసి
అయితే ఈ ప్రమాదానికి కారణాలు ఏమిటనేది అంతుచిక్కకుండా ఉన్నాయి. విమానం కూలిన ప్రాంతంలో వాతావరణం సాధారణంగానే ఉంది. విమాన పైలట్ భవ్యే సునేజా భారతీయుడు కాగా కోపైలట్కు కలిపి 11వేల గంటలకుపైగా విమానం నడిపిన అనుభవం ఈయనకు ఉంది. పైగా ఈ ఎరోప్లేన్ కూడా కొత్తది. ఈ ఏడాది ఆగస్టు లోనే వినియోగంలోకి వచ్చింది. అయితే అంతకుముందు ఒకే ఒకసారి ఈ విమానానికి సాంకేతిక సమస్య తలెత్తగా దానికి బాలీలో మరమ్మతులు చేశామని లయన్ ఎయిర్ వివరించింది. ఇది విశేష జనాదరణ పొందిన బోయింగ్-737 మ్యాక్స్-8 శ్రేణి విమానం కాగా...అసలు ఈ రకం విామానం కూలిపోవడం ఇదే మొదటిసారి. ఈ పరిణామంపై బోయింగ్ సంస్థ కూడా తీవ్ర విచారం వ్యక్తం చేసింది.
బ్లాక్బాక్స్...దొరికితే
ఈ అనూహ్య ప్రమాదానికి కారణం ఏమిటనేది విమానంలోని కాక్పిట్ వాయిస్ రికార్డర్, డేటా ఫ్లైట్ రికార్డర్తో కూడిన ‘బ్లాక్ బాక్స్' దొరికితేనే తెలుస్తుంది. ‘‘ఈ విమానం చాలా ఆధునికమైందని...పాతకాలపు విమానాల్లా కాకుండా ఇది డేటాను ఎప్పటికప్పుడు ట్రాన్స్ ఫర్ చేస్తుందని...అవన్నీ సమీక్షిస్తున్నామని అని అధికారులు తెలిపారు. అయితే సముద్రంలో శకలాలను గుర్తించి, బ్లాక్ బాక్స్ను దొరకబుచ్చుకోవడం చాలా కష్టమేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ విమాన గమ్యస్థానమైన పంగ్కల్ పినాంగ్ నగరం టూరిస్ట్ సెంటర్ కాగా దీనికి సమీపంలోని బెలిటుంగ్ దీవి బీచ్ అంతర్జాతీయంగా గుర్తింపు పొందింది. ఈ ప్రమాద వార్త తెలియగానే పంగ్కల్ పినాంగ్, జకార్తా విమానాశ్రయంలో తీవ్ర విషాదఛ్చాయలు అలముకొన్నాయి.