షాకింగ్: ఐఫోన్ కోసం కిడ్నీ అమ్మేయాలనుకున్నారు
బీజింగ్: నేటి యువత స్మార్ట్ ఫోన్ల వెంట, ఇంటర్నెట్ వెంట పడుతోన్న విషయం తెలిసిందే. స్మార్ట్ ఫోన్ల కోసం యువత ఎగబడుతోంది. చైనాలో ఐఫోన్ కోసం ఇద్దరు యువ స్నేహితులు చేసిన ప్రయత్నం.. అందర్నీ కలవరానికి గురి చేస్తోందని చెప్పవచ్చు.
చైనాలో సదరు ఇద్దరు యువకులు ఐఫోన్ 6ఎస్ కోసం తమ కిడ్నీలనే అమ్మేందుకు ప్రయత్నించారు. ఈ సంఘటన చైనాలోని జియాంక్షు ప్రాంతంలో వెలుగు చూసింది.
సమాచారం మేరకు... యూ అనే యువకుడు అతని స్నేహితుడు ఐఫోన్ 6ఎస్ కొనాలని భావించారు. అయితే, దానిని కొనేందుకు అవసరమైన డబ్బులు వారి వద్ద లేవు.
దీంతో, యూ అతని స్నేహితుడైన హాంగ్లు... ఐఫోన్ కొనేందుకు చెరి ఒక కిడ్నీ అమ్మేద్దామని నిర్ణయించుకున్నారు. తద్వారా డబ్బులు సమకూర్చుకుందామనుకున్నారు.
అయితే, వారు ఇంటర్నెట్ ద్వారా కిడ్నీల వ్యాపారం చేసే ఓ వ్యక్తి వివరాలు తీసుకున్నారు. అతను కూడా సరైన ఏజెంట్ కాదని తెలుస్తోంది. కిడ్నీలు ఇచ్చేముందు మెడికల్ పరీక్షలకు హాజరు కావాలని సదరు మీడియేటర్ ఈ ఇద్దరు స్నేహితులకు సూచించాడు.
ఏజెంట్ చెప్పినట్లుగా.. సెప్టెంబర్ 12వ తేదీన వారు పరీక్షల కోసం వచ్చారు. ఆ తర్వాత వారికి తెలిసింది.. ఆ ఏజెంట్ కూడా సరైన వాడు కాదని. అనంతరం, కిడ్నీలను అమ్మే విషయంలో స్నేహితులు పునరాలోచనలో పడ్డారు.
తొలి యువకుడు యూ తన స్నేహితుడు హాంగ్తో... కిడ్నీలను అమ్మే ఆలోచన వద్దని చెప్పాడు. దీనిని హాంగ్ పెడచెవిన పెట్టాడు. కిడ్నీలు అమ్మవద్దని యూ ఎంత చెప్పినా హాంగ్ వినలేదు. దీంతో, చివరకు యూ పోలీసులకు ఫోన్ చేశాడు. అయితే, అప్పటికే హాంగ్ పరారయ్యాడు.