షాక్: పాకిస్తాన్పై మరో సర్జికల్ స్ట్రైక్ -2న అర్ధరాత్రి ఘటన -తన జవాన్ల కోసం ఇరాన్ సంచలన చర్య
టెర్రరిస్టుల కార్ఖానాగా ఆరోపణలు ఎదుర్కొంటోన్న పాకిస్తాన్పై మరోసారి సర్జికల్ స్ట్రైక్ జరిగింది. ఇప్పటికే భారత్, అమెరికా సైన్యాలు వేర్వేరు సందర్భాల్లో పాకిస్తాన్ భూభాగంలోకి చొరబడి మరీ టెర్రరిస్టుల్ని ఖతం చేయగా.. ఇప్పుడు ఇరాన్ కూడా అదే చర్యకు పాల్పడింది. పాకిస్తాన్ ఆర్మీ పెంచిపోషిస్తోన్న టెర్రరిస్టుల చేతిలో బందీలుగా ఉన్న జవాన్లను విడిపించుకోడానికి ఇరాన్ భారీ సాహసానికి ఒడిగట్టిందిలా..
మరుపురాని ప్రయాణం మళ్లొచ్చె -హైదరాబాద్లో 25 డబుల్ డెక్కర్ బస్సులు -రూట్లివే -ముహుర్తం ఎప్పుడంటే
అర్ధరాత్రి అలికిడి లేకుండా..
పాకిస్తాన్ గడ్డపై బలూచిస్తాన్ ప్రావిన్స్ లో గల ఉగ్రవాద స్థావరాలపై 'ఇంటెలిజెన్స్ ఆపరేషన్' నిర్వహించామని ఇరాన్ ఎలైట్ రివల్యూషనరీ గార్డ్స్(IRGC) అధికారికంగా ప్రకటించింది. మంగళవారం(ఈనెల 2న) అర్ధరాత్రి నిర్వహించిన ఈ ఆపరేషన్ లో టెర్రరిస్టుల చేతుల్లో బందీలుగా ఉన్న తమ సైనికులు ఇద్దరిని విడిపించుకున్నామని ఇరాన్ సైన్యం తెలిపింది. అయితే, ఆపరేషన్ లో ఎంత మంది టెర్రరిస్టుల్ని మట్టు పెట్టారనే విషయాన్ని మాత్రం ఇరాన్ వెల్లడించలేదు. రెండు దేశాల్లోని ప్రధాన మీడియా సంస్థల రిపోర్టుల ప్రకారం.. పాక్ గడ్డపై ఇరాన్ సైన్యం జరిపిన నిర్దేశిత దాడులు(సర్జికల్ స్ట్రైక్స్)లో పదుల సంఖ్యలో టెర్రరిస్టులు హతమైనట్లు తెలుస్తోంది. స్ట్రైక్ జరిగిందని పాక్ బలగాలు పసిగట్టేలోపే ఇరాన్ సైనికులు చాకచక్యంగా తమ వాళ్లను విడిపించుకుపోయారు. నిజానికి..
2018లో కిడ్నాప్ చేయగా..
భారత్-పాకిస్తాన్లకు రెండు వైపులా పంజాబ్ ఉన్నట్లుగా.. ఇరాన్ -పాకిస్తాన్ మధ్య బలూచిస్తాన్ ప్రాంతం రెండుగా చీలి ఉంది. ఇరాన్ భూభాగంలోనిది 'సిస్తాన్ అండ్ బలూచిస్తాన్ ప్రావిన్స్'గా, పాక్ గడ్డమీదున్నదేమో 'బలూచిస్తాన్ ప్రావిన్స్'గా కొనసాగుతున్నాయి. బలూచీ సున్నీల ప్రాబల్యం ఎక్కువగా ఉండే ఈ ప్రాంతాల్లో ఆ వర్గానికి చెందిన టెర్రరిస్టు నేతల సారధ్యంలో 'జైష్ -ఉల్ -ఆదిల్' అనే గ్రూపు కొనసాగుతోంది. పాక్ బలూచిస్తాన్ నుంచి కార్యకలాపాలు నిర్వహించే ఈ గ్రూపు.. ఇరాన్ లోని బలూచీలతో సాయుధ తిరుగుబాటు చేయించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఆ క్రమంలో కొన్నేళ్లుగా ఇరాన్ సైన్యంతో తలపడుతూ వస్తోంది. 2018లో ఇరాన్ రివల్యూషనరీ గార్డుల్ని కిడ్నాప్ చేయడంతో ఆ సంస్థ పేరు పాపులరైపోయింది..
పాక్పై మూడో సర్జికల్ స్ట్రైక్..
బలూచిస్తాన్ సరిహద్దులో పహారా కాస్తోన్న 12 మంది ఇరాన్ జవాన్లను జైష్-ఉల్ టెర్రరిస్టులు మూడేళ్ల కిందట కిడ్నాప్ చేసి, పాక్ బలూచ్ లోని తమ స్థావరాలకు తరలించారు. అప్పట్లో ఆ ఘటనపై అంతర్జాతీయంగానూ కలకలం రేగడంతో కలవరపడ్డ పాకిస్తాన్.. టెర్రరిస్టులతో చర్చలు జరిపి అప్పటికప్పుడే ఐదుగురు జవాన్లను విడుదల చేయించింది. 2019 మార్చిలో మరో ఐదుగురు ఇరాన్ జవాన్లను పాకిస్తాన్ ఆర్మీనే రెస్క్యూ చేసింది. మిగిలిన ఇద్దరు జవాన్ల విడుదల కోసం ఇరాన్ చేసిన ప్రయత్నాలన్నీ విఫలం కావడంతో చివరికి సర్జికల్ స్ట్రైక్ కు దిగింది. తద్వారా ఆ పని చేసిన మూడో దేశంగా ఇరాన్ అవతరించింది. గతంలో అల్ ఖాయిదా అధినేత బిన్ లాడెన్ కోసం అబోటాబాద్ లోని స్థావరంపై అమెరికా సర్జికల్ స్ట్రైక్ చేయగా, జమ్మూకాశ్మీర్ లోని పుల్వామాలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్ పై దాడికి ప్రతీకారంగా భారత వాయుసేన పాకిస్తాన్ లోని బాలాకోట్ లో గల ఉగ్రస్థావరాలను కూల్చేసింది. తాజాగా ఇరాన్ చేసిన దాడులపై పాకిస్తాన్ అధికారికంగా స్పందించాల్సి ఉంది..
రిహానా ట్వీట్ కంటే మోదీ తీరే డేంజర్ -నిరసనే ప్రజాస్వామ్యానికి జీవనాడి -రాజ్యసభలో సంచలన స్పీచ్