కేంద్ర మంత్రికి కరోనావైరస్.. దగ్గుతూనే ప్రెస్ మీట్.. వరల్డ్ కప్ వాయిదా
పౌల్ట్రీ పరిశ్రమ మినహా భారత్లో పెద్దగా ప్రభావం చూపనప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్-19(కరోనా వైరస్) ఇంకా విజృంభిస్తూనేఉంది. చైనాతోపాటు మొత్తం పాతిక దేశాలు వైరస్ ధాటికి విలవిలలాడుతున్నాయి. ఇస్లామిక్ దేశం ఇరాన్లోనైతే ఏకంగా కేంద్ర ఆర్థిక మంత్రినే కరోనా కాటేసింది. ఆర్థిక మంత్రి ఇరాజ్ హారిర్చీకి వైద్య పరీక్షలు నిర్వహించగా, పాజిటివ్ వచ్చినట్లు ఆయన మంత్రిత్వ శాఖ అధికారులే మంగళవారం ప్రకటన చేశారు.
మరో ఇద్దరు భారతీయులకు..
జపాన్ సముద్ర తీరంలో నిర్బంధంలో ఉన్న ‘డైమండ్ ప్రిన్సెస్' నౌకలో మరో ఇద్దరు భారతీయులు కరోనా బారిన పడినట్లు అధికారులు తెలిపారు. దీంతో బాధిత భారతీయుల సంఖ్య14కు పెరిగినట్లయింది. వాళ్లందరినీ ఐసోలేషన్ వార్డుల్లో ఉంచి చికిత్స అందిస్తున్నామని, ముందే ఆస్పత్రుల్లో చేరినవారు ఇప్పటికే కోలుకుంటున్నారని జపాన్ లోని భారత ఎంబసీ తెలిపింది.
చైనాలో పరిస్థితేంటంటే..
కోవిడ్ 19(కరోనా వైరస్) జన్మస్థలమైన చైనాలో వైరస్ వ్యాప్తితో పోల్చుకుంటే మరణాల రేటు కాస్త తగ్గినట్లు అధికారులు చెప్పారు. సోమవారం అర్ధరాత్రి వరకు ప్రపంచ వ్యాప్తంగా కరోనా కాటుకు మొత్తం 2,700 మందిబలైతే, అందులో 2,663మంది చైనాలోనే చనిపోయారని ఆ దేశ హెల్త్ కమిషన్ ప్రకటించింది. వైరస్ ఉధృతి కారణంగా చైనాలో పార్లమెంట్ సమావేశాలు వాయిదాపడ్డాయి.
వరల్డ్ కప్ వాయిదా
చైనా పక్కనేఉన్న దక్షిణ కొరియాలోనూ కరోనా కలకలం రేపుతోంది. ఇప్పటికే అక్కడ వెయ్యిమందికిపైగా వైరస్ బారినపడ్డారు. దేశంలో నాలుగో అతిపెద్ద నగరం డేగూలో వైరస్ ప్రభావం ఎక్కువగా ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధ్యక్షుడు మూన్ జీ ఇన్ ప్రకటన చేశారు. కరోనా దెబ్బకు కొరియాలో మార్చి 22 నుంచి జరగాల్సిన టేబుల్ టెన్నిస్ ప్రపంచ కప్ టోర్నీ.. జూన్ కు వాయిదా పడింది.