భారత్ కు మరో ఎదురుదెబ్బ- కీలక ప్రాజెక్టు నుంచి తప్పించిన ఇరాన్.. చైనా ఒత్తిళ్ల ఫలితం..
గల్వాన్ ఘటన తర్వాత అంతర్జాతీయ వ్యవహారాల్లో భారత్ ను ఏకాకిని చేసేందుకు చైనా భారీ ఎత్తున పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా ఇప్పటికే చైనాతో ఉద్రిక్తతలు పెరిగితే అమెరికా భారత్ కు హ్యాండివ్వడం ఖాయమన్న సంకేతాలు పంపిన చైనా.. ఇప్పుడు మనకు కీలక మిత్రదేశం ఇరాన్ పై కూడా అంతకు మించిన ఒత్తిడి తీసుకొచ్చి ఓ కీలక ప్రాజెక్టుకు దూరం చేసింది. తద్వారా భారత్ కు మిత్ర దేశాలు కూడా దూరమవుతున్నాయన్న సంకేతాలు పంపాలని భావిస్తోంది. దీంతో ఈ వ్యవహారం ఇప్పుడు జాతీయ, అంతర్జాతీయ స్ధాయిలో తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది.
Recommended Video
భారత్ కు హ్యాండిచ్చిన ఇరాన్...
గతంలో అణ్వస్త్ర కార్యక్రమం సహా పలు అంశాల్లో భారత్ మద్దతు పొందిన ఇరాన్ తాజాగా ఓ కీలక ప్రాజెక్టు విషయంలో ముందూ వెనుకా ఆలోచించకుండా భారత్ కు హ్యాండ్ ఇచ్చేసింది. ఆప్ఘనిస్తాన్ సరిహద్దుల వెంబడి చబహార్ పోర్టు నుంచి జాహేదాన్ వరకూ 400 మిలియన్ డాలర్ల వ్యయంతో ఇరుదేశాలూ సంయుక్తంగా నిర్మించ తలపెట్టిన కీలక రైల్వే ప్రాజెక్టు నుంచి భారత్ ను తప్పిస్తూ ఇరాన్ తాజాగా నిర్ణయం తీసుకుంది. నిధుల విషయంలో భారత్ నుంచి సహకారం ఆలస్యమవుతుండటంతో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ఇరాన్ చేసిన ప్రకటన భారత్ కు శరాఘాతంగా పరిణమిస్తోంది.
నాలుగేళ్ల క్రితం ఒప్పందం..
నాలుగేళ్ల క్రితం చబహార్ పోర్టు నుంచి జూబేదాన్ కు కనెక్టిటివిటీ ఏర్పాటు ద్వారా ఆర్ధికంగా ఇరుదేశాలకు ప్రయోజనం ఉండేలా ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. 628 కిలోమీటర్ల పొడవైన ఈ మార్గం నిర్మాణం కోసం 400 బిలియన్ డాలర్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. భారత్-ఇరాన్ సంయుక్తంగా ఈ నిధులు సమకూర్చుకోవాల్సి ఉంది. కానీ వివిధ కారణాలతో భారత్ నుంచి రావాల్సిన వాటా నిధులు ఆలస్యం కావడాన్ని సాకుగా చూపుతూ ఇరాన్ ఈ ప్రాజెక్టును తామే స్వయంగా నిర్మించుకుంటామని, ఇందులో భారత్ పాత్ర అవసరం లేదని తేల్చిచెప్పింది. దీంతో భారత్ కు పశ్చిమాసియా ప్రాంతంలో పెద్ద ఎదురుదెబ్బ తగిలినట్లయింది. ఈ ప్రాజెక్టుకు అవసరమైన 400 బిలియన్ డాలర్ల నిధులను ఇరాన్ జాతీయ అభివృద్ధి నిధి నుంచి సమకూర్చుకుంటున్నట్లు తెలిపింది.
చైనా ఒత్తిళ్లే కారణం...
గల్వాన్ ఘటన తర్వాత భారత ఉపఖండంలో ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తున్న చైనా.. అదే సమయంలో భారత్ కు ఎంతోకాలంగా నమ్మకంగా ఉంటున్న మిత్రులను కూడా దూరం చేసేందుకు సిద్దమైంది. ఇదే కోవలో ఇరాన్ కు చబహార్ రైలు ప్రాజెక్టుకు ఖర్చుపెడుతున్న 400 బిలియన్ డాలర్ల నిధులను తామే ఇచ్చేందుకు చైనా సిద్ధమైంది. అయితే ఇది నేరుగా కాకుండా పలు మార్గాల్లో ఇరాన్ కు అందనున్నాయి. కానీ ఇరాన్ మాత్రం వాటిని తమ సొంత నిధులుగానే చెప్పుకుంటోంది. అయితే ఇరాన్ తీసుకున్న తాజా నిర్ణయం మాత్రం చైనా ఒత్తిళ్ల వల్లేనని మాత్రం స్పష్టమవుతోంది.