యుద్ధం ఆరంభమైందా?: ఇరాక్ అమెరికా సైనిక స్థావరాలపై విరుచుకుపడ్డ ఇరాన్.. !
Recommended Video
టెహ్రాన్: ఊహించినట్టే- ఇరాన్ ప్రతీకార దాడులకు దిగింది. ఇరాక్ లోని అమెరికా సైనిక స్థావరాలపై క్షిపణులతో విరుచుకుపడింది. అమెరికా ఎయిర్ బేస్, ఇతర సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని వరుసగా క్షిపణులను ప్రయోగించింది. ఈ విషయాన్ని అమెరికా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రధాన కార్యాలయం పెంటగాన్ సైతం ధృవీకరించింది. ఇరాక్ లోని తమ స్థావరాలపై క్షిపణి దాడులు చోటు చేసుకున్నాయని, వాటిని ఇరాన్ ప్రయోగించినట్లు అనుమానిస్తున్నామని స్పష్టం చేసింది.
మాటల యుద్ధం.. ఆపై క్షిపణుల ప్రయోగం..
ఇరాక్ రాజధాని బాగ్దాద్ పై అమెరికా వైమానిక దళం నిర్వహించిన దాడుల్లో ఇరాన్ సైన్యాధ్యక్షుడు ఖాసిం సోలేమని దుర్మరణం పాలైన విషయం తెలిసిందే. ఈ ఘటన తరువాత- అమెరికా, ఇరాన్ మధ్య పెద్ద ఎత్తున మాటల యుద్ధం నడిచింది. ఈ దాడులకు పాల్పడిన అమెరికా తగిన మూల్యాన్ని చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. అమెరికా వైమానిక దాడులను అంతర్జాతీయ ఉగ్రవాద చర్యగా అభివర్ణించింది.
సోలేమని భౌతిక కాయానికి అంత్యక్రియలు ముగిసిన వెంటనే..
సోలేమని భౌతిక కాయానికి అంత్యక్రియలను నిర్వహించిన కొన్ని గంటల వ్యవధిలోనే ఇరాన్ ప్రతీకార దాడులకు దిగడం ప్రాధాన్యతను సంతరించుకుంది. సోలేమని భౌతిక కాయానికి నిర్వహించిన అంతిమయాత్రలో 35 మందికి పైగా ఆయన అభిమానులు దుర్మరణం పాలు కావడం ఇరాన్ ను మరింత అసహనానికి గురి చేసి ఉంటుందని అంటున్నారు.ఫలితంగా- అనుకున్న గడువు కంటే ముందే ప్రతిదాడులకు దిగిందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.
బాలిస్టిక్ క్షిపణులతో..
అంత్యక్రియలు ముగిసిన కొన్ని గంటల వ్యవధిలోనే ఇరాక్ లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాక్ ఆర్మీ.. బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. ఇరాక్ ఉత్తర ప్రాంతంలోని ఇర్బిల్, పశ్చిమ ప్రాంతంలోని అల్ అసద్ లల్లో అమెరికాకు చెందిన ఎయిర్ బేస్, ఇతర సైనిక స్థావరాలపై ఈ దాడులు చోటు చేసుకున్నాయి. ఈ విషయాన్ని పెంటగాన్ ధృవీకరించింది. అమెరికా అధ్యక్షుడి నివాసం వైట్ హౌస్ అధికార ప్రతినిధి, ప్రెస్ కార్యదర్శి స్టెఫానీ గ్రీషమ్ ఈ మేరకు ఓ ప్రకటనను విడుదల చేశారు.
పరిస్థితిని సమీక్షిస్తోన్న ట్రంప్
తమ ఎయిర్ బేస్, సైనిక స్థావరాలపై ఇరాన్ దాడులకు పాల్పడినట్లు సమాచారం తెలిసిన వెంటనే.. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అప్రమత్తం అయ్యారని, పరిస్థితిని సమీక్షిస్తున్నారని గ్రీషమ్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు. భవిష్యత్తులో చేపట్టబోయే కార్యాచరణ ప్రణాళికపై ఆయన ఆర్మీ, వైమానిక దళాధికారులు, రక్షణ మంత్రిత్వ శాక అధికారులతో సమావేశం అయ్యే అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు.