ట్రంప్ తలతో రండి.. ఈ భారీ బహుమానంను పట్టుకెళ్లండి: ఇరాన్ ఆఫర్
ట్రెహాన్: జనవరి 3న వైమానిక దాడులు జరిపి ఇరాన్ ఆర్మీ చీఫ్ ఖాసిం సులేమనీని అమెరికా మట్టుబెట్టడాన్ని ఇరాన్ దేశం జీర్ణించుకోలేకుంది. అమెరికాపై ఇప్పటికే రగిలిపోతోంది. ముఖ్యంగా ఈ ఆపరేషన్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ను అంతమొందిస్తామంటూ బహిరంగ ప్రకటనలు చేస్తోంది. అంతేకాదు అమెరికాపై కచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటామని కూడా చెప్పింది. ఈ క్రమంలోనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తల తీసుకొచ్చిన వారికి భారీ బహుమానం ప్రకటించింది ఇరాన్.
ఇరాన్ ఆర్మీ చీఫ్ను హత మార్చడంతో మిడిల్ ఈస్ట్లో యుద్ధవాతావరణం అలుముకుంది. ఏ క్షణమైన యుద్ధం జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇందుకోసం ఇరాన్ కూడా తన అణ్వాయుధాలకు పదను పెడుతోంది. అమెరికాపై పగతో రగిలిపోతోంది. ఖాసిం అంత్యక్రియలు సందర్భంగా అమెరికాను అంతం చేస్తామని ఇరాన్ సుప్రీం అయతుల్లా ఖామేనీ, ఖాసిం మృతదేహంపై ప్రమాణం చేశారు కూడా. అయితే తాజాగా మరో భారీ ఆఫర్ ఇరాన్ ఇచ్చింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తల తీసుకొస్తే 80 మిలియన్ డాలర్లను బహుమతిగా ఇస్తామని ఇరాన్ ప్రకటించింది.
ఇరాన్ జనాభా లెక్కల ప్రకారం ఆదేశంలో 80 మిలియన్ల ప్రజలు నివసిస్తున్నారు. ఒక్కొక్కరికి ఒక్కో మిలియన్ డాలర్లను ప్రకటించింది. ఒకరే అమెరికా అధ్యక్షుడి తలను తీసుకువస్తే వారికే మొత్తం 80 మిలియన్ డాలర్లను అందజేస్తామని ఇరాన్ ప్రభుత్వం ప్రకటించినట్లు ప్రముఖ అంతర్జాతీయ వార్తా పత్రిక కథనంలో రాసుకొచ్చింది. జనవరి 3న బాగ్దాద్ విమానాశ్రయంకు సమీపంలో జరిగిన వైమానిక దాడుల్లో ఇరాన్ ఆర్మీ చీఫ్ ఖాసిం సులేమానితో పాటు ఇరాక్ పారామిలిటరీ డిప్యూటీ చీఫ్ అబు మహ్ది అల్ ముహందీ దుర్మరణం చెందారు. మరోవైపు అమెరికా శ్వేత సౌధంపై వారి గడ్డపై నుంచే దాడులు నిర్వహిస్తామని ఇరాన్ ఎంపీ అబోల్ఫజ్ బెదిరించినట్లు మిర్రర్ పత్రిక తన కథనంలో రాసుకొచ్చింది.
తమ దగ్గర అమెరికాను ఢీకొనే బలం బలగం ఉందని చెప్పిన ఎంపీ సరైన సమయంలో సరైన దాడులు నిర్వహిస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఇదే యుద్ధప్రకటనగా భావించి అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరించారు. ఏ క్షణమైనా క్షిపణులు దూసుకొస్తాయని గట్టి వార్నింగ్ను ఇచ్చారు ఎంపీ అబోల్ఫజ్. అంతేకాదు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సూటు ధరించిన ఉగ్రవాదిగా ఇరాన్ పేర్కొంది.