ఇరాన్ వైస్ ప్రెసిడెంట్కు కరోనావైరస్... చైనా తర్వాత అక్కడే ఎక్కువగా మరణాలు
దుబాయ్: ప్రపంచాన్ని కరోనావైరస్ గడగడలాడిస్తోంది. చైనాలో వెలుగు చూసిన ఈ ప్రాణాంతక వైరస్ పలు దేశాలకు వ్యాపించింది. తాజాగా కరోనావైరస్ కేసులు ఇరాన్లో క్రమంగా పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు అక్కడ 26 మంది మృతి చెందారు. మరో 245 మంది చికిత్స పొందుతున్నారు. ఇక కరోనా దెబ్బకు ఇరాన్ వీధులు నిర్మనుష్యంగా మారుతున్నాయి. శుక్రవారం జరగాల్సిన నమాజ్లను నిలిపివేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే చైనా పౌరులకు ఇరాన్ ప్రవేశంపై నిషేధం విదించింది ఇరాన్ ప్రభుత్వం
తాజాగా కరోనావైరస్ ఇరాన్ మహిళలు మరియు కుటుంబ వ్యవహారాలశాఖ ఉపాధ్యక్షుడు మాసోమె ఎబ్తేకర్కు సోకింది. అంతేకాదు డిప్యూటీ హెల్త్ మినిస్టర్ ఇరాజ్ హరిర్చికి కూడా సోకింది. ఎబ్తేకర్కు మరీ ప్రమాదకర స్థాయిలో లేకపోవడంతో ఆమెను హాస్పిటల్లో అడ్మిట్ చేయలేదు. గత 24 గంటల్లో ఇరాన్లో 106 కొత్త కరోనా వైరస్ కేసులు వచ్చినట్లు ఆదేశ ఆరోగ్యశాఖ ప్రతినిధి కైనిష్ జహన్పూర్ చెప్పారు. అంతేకాదు కొన్ని ఆంక్షలు కూడా విధించాలని యోచిస్తున్నట్లు జహాన్పూర్ చెప్పారు. ఇందులో భాగంగా శుక్రవారం జరగాల్సిన బహిరంగ నమాజ్లను రద్దు చేయాలని భావిస్తున్నట్లు జహాన్పూర్ చెప్పారు. అయితే ఇందుకు అధ్యక్షుడి అనుమతి తప్పనిసరి అని చెప్పారు.
ఇప్పటికే చాలామంది అనుమానితుల్లో వైరస్ టెస్టుల సందర్భంగా నెగిటివ్ రావడంతో వారిని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. మరోవైపు ఎవరినీ నిర్బంధంలో ఉంచి చికిత్స అందించడం లేదని ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహానీ చెప్పారు. ఇదిలా ఉంటే సినిమా హాళ్లు, బహిరంగ కార్యక్రమాలు, ఇతర కాన్ఫ్రెన్స్లపై ఓ వారం రోజుల పాటు నిషేధం విధించింది ఇరాన్ సర్కార్. ఇక కరోనా వైరస్ నిర్థారించిన కేసుల్లో 10శాతం వేగంతో ఇరాన్లో ప్రాణాలు కోల్పోతున్నారని అదే ఇతర దేశాల్లో మాత్రం 3శాతం వేగం మాత్రమే కనిపిస్తోందని అధికారులు తెలిపారు.
ఇరాన్లోకి కరోనా వైరస్ ఎలా ప్రవేశించిందో ఇప్పటికీ గుర్తించలేకున్నామని ప్రపంచ ఆరోగ్యసంస్థ ఎమర్జెన్సీ ప్రోగ్రాం అధికారి మైక్ ర్యాన్ చెప్పారు. తాము అనుకుంటున్న దానికంటే ఎక్కువగానే ఇరాన్లో కరోనా వైరస్ వ్యాప్తి చెంది ఉంటుందని చెప్పారు. గత వారం రోజుల నుంచే కరోనా వైరస్ మృతుల సంఖ్య గురించి ఇరాన్ ప్రకటన విడుదల చేస్తోంది.