‘దాడి చేస్తాం’.. పాకిస్తాన్ కు ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్
పాకిస్తాన్ కు ఇరాన్ సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. ఉగ్రవాదులకు సాయం చేయడాన్ని వెంటనే ఆపివేయాలని... లేకపోతే పాక్ భూభాగంలో ఉండే ఉగ్రవాద శిబిరాలపై దాడి చేస్తామని హెచ్చరించింది.
టెహ్రాన్: ఉగ్రవాదుల తయారీ కేంద్రంలా మారిన పాకిస్తాన్ కు ఇరాన్ సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. ఉగ్రవాదులకు సాయం చేయడాన్ని వెంటనే ఆపివేయాలని... లేకపోతే పాక్ భూభాగంలో ఉండే ఉగ్రవాద శిబిరాలపై దాడి చేస్తామని హెచ్చరించింది.
క్రాస్ బోర్డర్ టెర్రరిజానికి పాల్పడుతున్న సున్నీ మిలిటెంట్లను వెంటనే నియంత్రించాలని ఇరాన్ కోరింది. గత నెలలో జరిగిన ఉగ్రదాడిలో 10 మంది ఇరానియన్ బోర్డర్ గార్డ్స్ మృతి చెందారు.
లాంగ్ రేంజ్ గన్స్ తో జైష్-అల్-ఆదిల్ మిలిటెంట్ సంస్థ ఈ దాడులకు తెగించిందని ఇరాన్ మండిపడింది. ఈ దాడులు పాక్ భూభాగం నుంచి జరిగాయని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి ఘటనలు జరగడాన్ని తాము ఎంత మాత్రం సహించమని ఇరాన్ ఆర్మీ చీఫ్ మేజర్ జనరల్ మొహమ్మద్ బకేరీ పాక్ కు స్పష్టం చేశారు.
సున్నీ ఉగ్రవాదులను అరెస్ట్ చేసి, ఉగ్రతండాలను పాక్ ప్రభుత్వం నిర్మూలిస్తుందని భావిస్తున్నామని, ఒకవేళ పాకిస్తాన్ ఆ పని చేయకపోతే... తామే రంగంలోకి దిగుతామని, పాక్లోని వారి స్థావరాలపై నేరుగా బాంబు దాడులు చేసి ధ్వంసం చేస్తామని హెచ్చరించారు.
'ఇలాంటి పరిస్థితిని ఇక చూడాలని అనుకోవడం లేదు. పాక్ వారిని అరెస్టు చేస్తుందని నమ్ముతున్నాం. వారి స్థావరాలను మూసివేస్తుందని భావిస్తున్నాం. ఉగ్రవాదుల దాడులు ఇలాగే కొనసాగితే మేం కచ్చితంగా పెద్ద మొత్తంలో ప్రతిఘటిస్తాం. రక్షణ స్థావరాలు ధ్వంసం చేస్తాం' అని ఇరాన్ మేజర్ జనరల్ మహ్మద్ బాకేరి స్పష్టం చేశారు.