భారత్ పెద్దన్న పాత్ర: అమెరికాకు నచ్చజెప్పేలా: ఎలాంటి చర్యనైనా స్వాగతిస్తాం: ఇరాన్..!
Recommended Video
న్యూఢిల్లీ: ఇరాక్లోని అమెరికా సైనిక స్థావరాలు, ఎయిర్ బేస్పై క్షిపణులతో దాడి చేసిన ఇరాన్.. కవ్వింపు చర్యలకు దిగినట్టయింది. అమెరికాను రెచ్చగొట్టేలా వ్యవహరించిందనే వార్తలు వెల్లువెత్తుతున్న వేళ.. ఇరాన్ కీలక ప్రకటన చేసింది. అమెరికాతో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను తగ్గించేలా భారత్ పెద్దన్న పాత్ర పోషించాల్సి ఉంటుందని వెల్లడించింది. రెండు దేశాల మధ్య సయోధ్య కుదిరేలా భారత్ ఎలాంటి చర్యను చేపట్టినా, ఎలాంటి నిర్ణయాన్ని గానీ తీసుకున్నా దాన్ని తాము స్వాగతిస్తామని పేర్కొంది.
ఖాసిం చిత్రపటానికి నివాళి..
ఈ విషయాన్ని భారత్లోని ఇరాన్ రాయబారి అలీ ఛెగెని వెల్లడించారు. అమెరికా వైమానిక దాడుల్లో మరణించిన సైన్యాధ్యక్షుడు ఖాసిం సోలేమనికి నివాళి అర్పించారు. న్యూఢిల్లీలోని ఇరాన్ రాయబార కార్యాలయంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఖాసిం సోలేమని చిత్రపటానికి నివాళిని అర్పించిన అనంతరం అలీ ఛెగెని విలేెకరులతో మాట్లాడారు. ఇరాక్లోని అమెరికా సైనిక స్థావరాలపై క్షిపణులతో దాడి చేయడాన్ని ఆయన సమర్థించుకున్నారు.
ఆత్మరక్షణ కోసమే..
దీన్ని అమెరికాను రెచ్చగొట్టే చర్యగా భావించకూడదని, ఆత్మరక్షణ కోసం తాము అమెరికా స్థావరాలపై దాడి చేయాల్సి వచ్చిందని అన్నారు. అమెరికాను యుద్ధానికి ప్రేరేపించే దిశలోనే ఇరాన్ ఈ వైమానిక దాడులకు దిగిందంటూ వచ్చిన వార్తలను అలీ ఛెగెని తోసి పుచ్చారు. తమను తాము కాపాడుకోవడాన్ని ఎవరూ యుద్ధంగా భావించబోరని వ్యాఖ్యానించారు. అమెరికా ఉద్దేశపూరకంగానే తమ సైన్యాధ్యక్షుడిని బలి తీసుకుందని చెప్పారు. అమెరికాపై దాడులను చేయడం తమ హక్కుగా అభివర్ణించారాయన.
భారత్ పెద్దన్న పాత్ర పోషించాలంటూ..
అమెరికా స్థావరాలపై దాడులు చేసిన తరువాత ఆ దేశంతో దౌత్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిని ఉండొచ్చని తాను భావిస్తున్నట్లు చెప్పారు. ఈ పరిస్థితుల్లో అమెరికాతో తమ దౌత్య సంబంధాలను పునరుద్ధరించడానికి, శాంతియుత వాతావరణం నెలకొల్పడానికి భారత్ ఎలాంటి చర్యను చేపట్టినా, ఏ సూచనలను చేసినా దాన్ని తాము స్వాగతిస్తామని స్పష్టం చేశారు. రెండు దేశాల మధ్య సత్సంబంధాలను పునరుద్ధరించడంలో భారత్ పెదన్న పాత్ర పోషించాల్సి ఉంటుందని చెప్పారు.
ఇరాన్కు మంచి మిత్రుడిగా..
సాధారణంగా- అంతర్జాతీయ స్థాయిలో శాంతియుత వాతావరణాన్ని కల్పించడంలో భారత్ అద్భుత పాత్ర పోషిస్తుంటుందని, ఆ సారి కూడా అదే తరహాలో వ్యవహరించాలని తాము కోరుకుంటున్నామని చెప్పారు. ఇరాన్కు ఓ మంచి మిత్రుడిగా భారత్ తన బాధ్యతను చాటుకోవాల్సిన సమయం ఆసన్నమైందని వ్యాఖ్యానించారు. అమెరికాతో యుద్ధానికి దిగాలని తాము ఏ మాత్రం కోరుకోవట్లేదని, మధ్య తూర్పు దేశాల్లో శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పడానికి తాము కట్టుబడి ఉన్నామని అన్నారు.