ఇరాక్లో ఉగ్రవాదుల మారణహోమం, ఒకే ప్రాంతంలో రెండుసార్లు దాడి, 60 మంది మృతి
ఇరాక్లో ఉగ్రవాదులు మారణహోమం సృష్టించారు. ఒకే ప్రాంతంలో రెండుసార్లు దాడికి దిగారు. నసిరియా ప్రాంతంలోని ఓ రెస్టారెంట్లోకి చొరబడిన ఉగ్రవాదులు అక్కడ ఉన్న వారిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు.
నసిరియా: ఇరాక్లో ఉగ్రవాదులు మారణహోమం సృష్టించారు. ఒకే ప్రాంతంలో రెండుసార్లు దాడికి దిగారు. నసిరియా ప్రాంతంలోని ఓ రెస్టారెంట్లోకి చొరబడిన ఉగ్రవాదులు అక్కడ ఉన్న వారిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు.
ఈ ఘటన జరిగిన కొద్ది సమయానికి దగ్గర్లోని భద్రతా సిబ్బంది చెక్ పాయింట్ వద్ద కారు బాంబుతో దాడి చేశారు. ఈ దాడిలో దాదాపు 60 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 90 మందికి పైగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
ఘటనా స్థలానికి చేరుకున్న సహాయక సిబ్బంది క్షతగాత్రులను చికిత్స నిమిత్తం దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. దాడి కారణంగా ఆ ప్రాంతమంతా ఛిద్రమైన శరీరాలు, రక్తంతో భీతావహంగా మారింది.
మృతుల్లో ఏడుగురు ఇరానీయులు కూడా ఉన్నట్లు ఆ ప్రాంత అధికారి జస్సీమ్ అల్ ఖాలిది తెలిపారు. ఈ దాడికి బాధ్యత వహిస్తున్నట్లు ఇప్పటి వరకూ ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటించలేదు. కానీ ఇవి ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల దుశ్చర్యలుగానే భావిస్తున్నారు.