36 మంది ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులకు ఉరి
బాగ్దాద్: ఇరాక్ లో 36 మంది ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా ఉగ్రవాదులను ఉరి తీశారు. ఆదివారం ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులను (ఇరాక్ పౌరులు) ఉరి తీశామని ఇరాక్ పోలీసు అధికారులు తెలిపారు.
రెండేళ్ల క్రితం టిక్రిట్ నగరంలో ఆర్మీ స్థావరాలపై ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు దాడి చేశారు. నాలుగు వందల మంది సైనికులను కిరాతకంగా చంపేశారు. గతేడాది ఇరాక్ భద్రతా దళాలు మళ్లీ టిక్రిట్ నగరాన్ని స్వాధీనం చేసుకున్నారు.
అక్కడ వందల మంది సైనికుల అస్థిపంజరాలు బయటపడ్డాయి. అదే సందర్బంలో భద్రతా దళాలు ఉగ్రవాదులను బందీలుగా పట్టుకుని కోర్టు ముందు నిలబెట్టారు. ఈ ఘటనలో 36 మంది జీహాదీలు దోషులుగా తేలారు.
36 మంది ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులను ఉరి తియ్యాలని గత ఫిబ్రవరి నెలలో కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాల మేరకు ఉగ్రవాదులకు దిఖార్ రాజధాని నిసిరియా జైల్లో ఉరి శిక్ష అమలు చేశామని ఇరాక్ ప్రభుత్వం తెలిపింది.