ఐఎస్ఐఎస్ ఆయిల్ స్మగ్లింగ్ వయా టర్కీ
బాగ్దాద్: ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు (ఐఎస్ఐఎస్)కు కళ్లెం వెయ్యాలంటే వారి ఆయిల్ స్మగ్లింగ్ ను అడ్డుకోవాలని, అప్పుడే వారిని అరికట్టడానికి అవకాశం ఉంటుందని ఇరాక్ ప్రధాని హైదర్ అల్ అబాది చెప్పారు.
జర్మన్ విదేశాంగ మంత్రి ఫ్రాంక్ వాల్టర్ స్టెయిన్ మీర్ బాగ్దాద్ పర్యటనకు వచ్చిన సందర్బంగా ఆయనతో సమావేశం అయిన తరువాత ఇరాక్ ప్రధాని హైదర్ అల్ అబాది ఈ వ్యాఖ్యలు చేశారు. ఇస్లామిక్ స్టేట్ కు భారీ మొత్తంలో అయిల్ స్మగ్లింగ్ టర్కీ ద్వారానే జరుగుతున్నదని గుర్తు చేశారు.
దానిని నిలువరించగలిగితే కొంత సమస్య తీరినట్లేనని హైదర్ అల్ అబాది అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇస్లామిక్ స్టేట్ ను నియంత్రించేందుకు ఇది దోహదపడుతుందని ఆయన చెప్పారు. ఇటివల రష్యా యుద్ధ విమానాన్ని టర్కీ కూల్చివేసిన విషయం తెలిసిందే.
ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులకు సహకరించాలనే ఉద్దేశంతోనే టర్కీ మా యుద్ధవిమాన్ని కూల్చి వేసిందని రష్యా బహిరంగంగా ఆరోపించింది. అయితే టర్కీ మాత్రం రష్యా ఆరోపణలను వ్యతిరేకించింది.
రష్యా ఆరోపణలను మరో అగ్రరాజ్యం కొట్టిపారేసింది. ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదులతో టర్కీకి సంబంధాలు ఉన్నాయని మా పరిశీలనలో వెల్లడికాలేదని, అందుకు ఆదారాలు లభ్యంకాలేదని చెప్పింది. అయితే రష్యా చేసిన ఆరోపణల తరువాత స్వయంగా ఇరాక్ ప్రధాని ఆయిల్ స్మగ్లింగ్ గురించి చెప్పడంతో ఇస్లామిక్ స్టేట్, టర్కీ అసలు రంగు బయటపడింది.