షాక్: ఆర్థిక కష్టాల్లో ఐసిస్, వీడుతున్న ఉగ్రవాదులు
సిరియా: ఐసిస్ను ఆర్థిక కష్టాలు చుట్టుముట్టాయా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. ఐసిస్కు ప్రధాన ఆదాయ వనరులుగా ఉన్న చమురు క్షేత్రాలను ధ్వంసం చేయడమే లక్ష్యంగా ప్రత్యర్థులు దాడులు ముమ్మరం చేశారు. దీంతో ఐసిస్ ఆర్థిక కష్టాల్లో పడింది.
తమ ఉగ్రవాదులకు పూర్తిస్థాయి వేతనాలు ఇవ్వలేకపోతోందట. ప్రస్తుతం ఐసిస్ సతమతమవుతోంది. దీంతో చాలామంది ఉగ్రవాదులు ఐసిస్ను వీడి, ఇతర ఉగ్రవాద సంస్థల్లో చేరుతున్నట్లుగా 'వాషింగ్టన్ పోస్ట్'లో తాజాగా విశ్లేషణాత్మక కథనం వెలువడింది.
దాని ప్రకారం.. ఇటీవల పలు పోరాటాల్లో పరాజయం పాలవ్వడం ఐసిస్చను దారుణంగా దెబ్బతీసింది. యుద్ధాల్లో మృత్యువాతపడ్డ వారి స్థానంలో, మెరుగైన ప్రయోజనాలను ఆశిస్తూ సంస్థను వీడిన వారి స్థానంలో నూతన నియామకాలు చేపట్టలేకపోతోంది.
ఇరాక్, సిరియాల్లో ఐసిస్ ఆక్రమణలో ఉన్న చాలా భూభాగాన్ని అమెరికా మద్దతుతో కూడిన కుర్దిష్, అరబ్ దళాలు ఇటీవల స్వాధీనం చేసుకున్నాయి. ఇరాక్, సిరియాల్లో ఐసిస్ తమ స్వాధీనం నుంచి ఇప్పటి వరకు వరుసగా 40, 20 శాతం భూమిని కోల్పోయినట్లు అమెరికా సైనికవర్గాల అంచనా వేస్తున్నాయి.
దీంతో ఆయా ప్రాంతాల్లో పన్నుల వసూలు, ఆస్తుల స్వాధీనం వంటి చర్యల ద్వారా సొమ్ము రాబట్టుకునే వీలును ఐసిస్ ఉగ్రవాద సంస్థ కోల్పోయింది. ఏడాది క్రితం వరకు ఎంతో సంపద కలిగి ఉన్న ఐసిస్ ఇప్పుడు ఆర్థిక కష్టాల్లో చిక్కుకుపోయింది. పని చేస్తున్న ఉగ్రవాదుల వేతనం సగానికి తగ్గించింది.