షాకింగ్: చైనాలో కిమ్ జోంగ్ ఉన్ రహస్య పర్యటన!? మళ్లీ ఏం జరగబోతోంది?
బీజింగ్: ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ చైనా వెళ్లినట్లుగా వార్తలు వెలువడ్డాయి. సోమవారం ఆయన రహస్యంగా చైనాలో పర్యటించారనేది ఆ వార్తల సారాంశం. ఆయనతోపాటు ఉత్తర కొరియాకు చెందిన ఉన్నతాధికారులు కూడా ఉన్నారని, వీరంతా ఓ ట్రైన్లో చైనాకు వచ్చారని ప్రచారం జరుగుతోంది.
మరోవైపు కిమ్ రహస్యంగా చైనాలో పర్యటించడంపై ప్రపంచ దేశాలన్నీ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. ఓ రహస్య సమావేశంలో పాల్గొనడానికే ఆయన బీజింగ్ చేరుకున్నట్లు వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.
రహస్య సమావేశం కోసమా?
ఇంతకీ ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ రహస్యంగా చైనా ఎందుకు వెళ్లినట్లు? అక్కడ ఆయన ఎవరితో భేటీ అవబోతున్నాడు? ఏయే అంశాలపై చర్చలు జరపబోతున్నాడు అనేది ఆసక్తిగా మారింది. ఈ విషయమై ఇటు చైనాగానీ, అటు ఉత్తర కొరియాగానీ నోరు మెదపడం లేదు.
అధికారం చేపట్టాక తొలిసారిగా...
ఒకవేళ కిమ్ చైనా పర్యటన వాస్తవమైన పక్షంలో 2011లో ఉత్తర కొరియా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తరువాత ఆయన తొలి విదేశీ పర్యటన ఇదే అవుతుంది. చైనా, ఉత్తర కొరియా సరిహద్దులో బలగాలను మోహరించడం, బీజింగ్లోని ప్రముఖ హోటల్ వద్ధ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేపట్టడం ఈ వార్తలకు బలం చేకూర్చుతున్నాయి.
అమెరికాతో వివాదం పరిష్కారమవుతున్న తరుణంలో...
అమెరికా, ఉత్తర కొరియాల మధ్య న్యూక్లియర్ క్షిపణుల అంశంలో చాలా కాలంగా ఉన్న వివాదం ఇప్పుడిప్పుడే పరిష్కారం దిశగా సాగుతున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా మేలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, కిమ్ల మధ్య భేటీ జరగనుంది. ఇప్పుడు కిమ్ జోంగ్ ఉన్ రహస్యంగా చైనాలో పర్యటించడంతో ఇది మళ్లీ ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో అని విశ్లేషకులు భావిస్తున్నారు.
రైలులో రహస్యంగా బీజింగ్కు...
ఈ నేపథ్యంలో ఉత్తర కొరియా అధ్యక్షుడు రహస్యంగా చైనాలో పర్యటించడం పలు అనుమానాలకు దారితీస్తోంది. చాలా కాలం నుంచి ఉత్తర కొరియా, చైనాకు మిత్ర దేశంగా ఉంది. కిమ్ తండ్రి కిమ్ జోంగ్ -2 చనిపోక ముందు చాలాసార్లు రహస్యంగా చైనాలో పర్యటించారు. సోమవారం కిమ్ ఉత్తర కొరియాకు చెందిన ఉన్నతాధికారులతో కలిసి పకడ్బందీ భద్రత నడుమ ఓ ట్రైన్లో బీజింగ్కు చేరుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.
కట్టుదిట్టమైన భద్రత నడుమ...
కట్టుదిట్టమైన భద్రత నడుమ ఉత్తరకొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్, ఆ దేశ ఇతర ఉన్నతాధికారులు ప్రయాణించిన రైలు బీజింగ్లోని రైల్వే స్టేషన్ను చేరుకోగానే అక్కడి పోలీసులు అప్రమత్తమయ్యారని, అక్కడ్నించి వారు తమకు సమకూర్చిన వాహనాల్లో వెళ్లిపోయారని తెలుస్తోంది. సరిగ్గా కిమ్ బీజింగ్లో అడుగుపెట్టే సమయానికి తియాన్మెన్ స్క్వేర్ వద్ద ఉన్న పర్యాటకులను కూడా హడావుడిగా అక్కడ్నించి పంపించేసినట్లు తెలుస్తోంది.