ఐసిస్ ఒక్కటే కాదు..ఐఎస్ కేపీ కూడా: శ్రీలంకపై దాడులతో తెరమీదికి కొత్త ఉగ్రవాద సంస్థ
కొలంబో: ఈస్టర్ సండే పర్వదినం నాడు శ్రీలంకలో మారణహోమం సృష్టించిన ఉదంతంలో తాజాాగా మరో కొత్త ఉగ్రవాద సంస్థ పేరు తెర మీదికి వచ్చింది. దీని పేరు ఇస్లామిక్ స్టేట్ ఖొరాసన్ ప్రావిన్స్ (ఐఎస్ కేపీ). ఇరాక్ కేంద్రంగా పని చేస్తోన్న భయానక ఉగ్రవాద సంస్థ ఐసిస్ కు అనుబంధంగా ఇది పుట్టుకొచ్చినట్లు తెలుస్తోంది. రాజధాని కొలంబో సహా పలు చోట్ల ఆత్మాహూతి దాడులకు సూత్రధారిగా అనుమానిస్తోన్న అబు ఉబైదా అలియాస్ జహ్రెయిన్ హాషిమ్ ఐఎస్ కేపీ ఉగ్రవాద సంస్థ నేతృత్వం వహించినట్లు అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఐసిస్ కు అనుబంధంగా పనిచేస్తోన్న ఐఎస్ కేపీ సంస్థే శ్రీలంక నరమేథానికి కారణమై ఉండొచ్చని తెలుస్తోంది. ఈ దిశగా శ్రీలంక ప్రభుత్వం దర్యాప్తు సాగిస్తోందని సమాచారం.
కొత్త ఇస్లామిక్ స్టేట్..
తమ కార్యకలాపాలను కొత్త దేశాలకు విస్తరింపజేస్తున్నట్లు ఐసిస్ 2014లో ఓ ప్రకటన చేసినట్లు చెబుతున్నారు. దీనికి అనుగుణంగా- ఆప్ఘనిస్తాన్, ఇరాన్, తుర్క్ మెనిస్తాన్, ఉజ్బెకిస్తాన్ దేశాల సరిహద్దులను కేంద్రంగా చేసుకుని, ఆయా దేశాల్లోని కొంత భూభాగాన్ని ఒకే గొడుగు కిందికి తీసుకుని వచ్చిన ప్రాంతాలను గ్రేటర్ ఖొరాసన్ గా గుర్తించారు. ఈ గ్రేటర్ ఖొరాసన్ ప్రావిన్స్ ను కేంద్రంగా చేసుకుని ఐఎస్ కేపీ ఆవిర్భవించిందని, తన ఉగ్రవాద కార్యకలాపాలను విస్తృతం చేసిందని అంటున్నారు. ఐఎస్ కేపీ సంస్థకు జహ్రెయిన్ హాషిమ్ కొన్నాళ్లపాటు నేతృత్వం వహించాడని, అనంతరం శ్రీలంకలో నేషనల్ తౌహీత్ జమాత్ ను ఏర్పాటు చేశాడని అంతర్జాతీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 2014లో పాకిస్తాన్ కు చెందిన హఫీజ్ సయీద్ ఖాన్ అనే వ్యక్తి ఐఎస్ కేపీకి నేతృత్వం వహించాడని, అతని తరువాత హాషీమ్ నాయకత్వ బాధ్యతలను స్వీకరించాడని చెబుతున్నారు.
మూడు నెలల కిందటే అప్రమత్తం చేసిన భారత్..
ఐసిస్ లేదా ఐఎస్ కేపీ ఉగ్రవాదులు శ్రీలంకపై పెద్ద ఎత్తున విరుచుకు పడే ప్రమాదం ఉందంటూ మనదేశ జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ) సుమారు మూడు నెలల కిందటే అంచనా వేసినట్లు తెలుస్తోంది. ఐసిస్ సానుభూతిపరునిగా భావించిన ఓ వ్యక్తిని చెన్నైలో ఎన్ఐఎ అధికారులు అరెస్టు చేశారు. అతణ్ని విచారించిన సందర్భంగా- శ్రీలంకపై దాడులు చేసే అవకాశాలు ఉన్నట్లు తేలిందట. అప్పుడే తొలిసారిగా దీని పేరు వినిపించిదని తెలుస్తోంది. మనదేశంపై తరచూ దాడులకు పాల్పడుతూ వచ్చిన లష్కరే తోయిబా సహా ఈ ఏడాది ఫిబ్రవరి 14వ తేదీన జమ్మూకాశ్మీర్ లోని పుల్వామా జిల్లా అవంతిపురా వద్ద సీఆర్పీఎఫ్ కాన్వాయ్ పై ఆత్మాహూతి దాడికి పాల్పడిన జైషె మహమ్మద్ సంస్థతోనూ ప్రత్యక్ష సంబంధాలు ఉన్నట్లు ఎన్ఐఏ దర్యాప్తులో తేలిందని సమాచారం. మాల్దీవులు, శ్రీలంకలో ఐఎస్ కేపీ స్థానిక యువకులను ఉగ్రవాదం వైపు ప్రోత్సహించి, వారిని దేశం దాటించిందంటూ స్పష్టమైందని జాతీయ దర్యాప్తు సంస్థ అంచనా వేసిందని అంటున్నారు.
రెండు గంటల ముందే..
శ్రీలంకలో ఆదివారం ఆత్మాహూతి దాడుల పెను ముప్పును మన దేశ ఇంటెలిజెన్స్ అధికారులు ముందే గ్రహించారు. దీనిపై శ్రీలంక ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తొలి ఆత్మాహుతి దాడికి రెండు గంటల ముందు శ్రీలంక ఇంటెలిజెన్స్ అధికారులతో భారత ఇంటెలిజెన్స్ అధికారులు సంప్రదింపులు జరిపారని, శ్రీలంకలోని కొన్ని చర్చిలకు ముప్పు ఉన్నదని భారత అధికారులు హెచ్చరించారని శ్రీలంక రక్షణ శాఖ అధికారి తెలిపారు. ఇదే విషయంపై భారత అధికారులు శనివారం రాత్రి కూడా తమను హెచ్చరించినట్టు శ్రీలంక ప్రభుత్వ అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఈ నెల 4వ తేదీతోపాటు 20వ తేదీన కూడా శ్రీలంక ఇంటెలిజెన్స్ అధికారులకు ఇదేవిధమైన హెచ్చరికలను పంపినట్టు భారత ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.